వరంగల్, మార్చి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కేంద్రంగా ఉన్న వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్ వెంటే ఉంటారు.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి మద్దతు తెలుపుతారు’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా బుధవారం సాయంత్రం డాక్టర్ కడియం కావ్యను ప్రకటించిన ఆయన, ‘ఈ ఎన్నికల్లో గెలుపు మనదే’నని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లోక్సభ సెగ్మెంట్లోని బీఆర్ఎస్ ముఖ్యనేతలతో పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఎన్నికలో బీఆర్ఎస్కు కచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్నదని చెప్పారు. సాగునీరు, కరెంటు సరఫరా నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏ రోజూ రైతులకు ఇబ్బంది కలుగలేదని చెప్పారు. వరంగల్ సెగ్మెంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, ఇక్కడ బీజేపీ నామమాత్రంగానే ఉంటుందన్నారు. వరంగల్ సెగ్మెంట్లో త్రిముఖ పోటీ ఉంటే బీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని, ప్రస్తుతం ప్రజల్లో ఆ పార్టీపై అసంతృప్తి పెరుగుతున్నదని తెలిపారు. వరంగల్ లోక్సభ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు సమష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజమని, బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల వ్యూహంలో పడవద్దని చెప్పారు. మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్ పర్సన్లు ఎం.సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.