నమస్తే నెట్వర్క్, మే 7: ఉమ్మడి వరంగల్ జిల్లాను మంగళవారం ఈదురుగాలులు ఆగమాగం చేశాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు కూలగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గణపురం, మహదేవపూర్, పలిమెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు, ఏటూరునాగారం, మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపూర్, వెంకటాపురం మండలాల్లో ధాన్యం రాశులు తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్ షీట్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. కమలాపూర్, ఐనవోలు, శాయంపేట, ధర్మసాగర్, దామెర, కాజీపేట మండలాల్లో చెట్లు విరిగాయి.
ఖానాపురం, ఆత్మకూరు, చెన్నారావుపేట, వర్ధన్నపేట మండలాల్లో బలమైన ఈదురుగాలులకు పలువురి ఇంటిపై కప్పులు ఎగిరిపడ్డాయి. గ్రేటర్ వరంగల్లో సుమారు రెండు గంటల పాటు గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో హనుమకొండ బస్స్టేషన్ జలమయం కాగా, పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోగా, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. మామిడి చెట్లకు కాయలు రాలిపోయాయి. కూరగాయలు, పండ్ల తోటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తొర్రూరులో మోస్తరు వర్షం కురిసింది.
వర్ధన్నపేట: వరంగల్ నుంచి వస్తున్న ట్రాక్టర్ డబ్బాలో ఇల్లంద గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఆబర్ల దయాకర్(22) ఎక్కగా, కట్య్రాల శివారులోని రహదారి పక్కన ఎండిపోయి ఉన్న భారీ చెట్టు ఒక్కసారిగా ట్రాక్టర్పై కూలిపోయింది. దీంతో దయాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. రోడ్డుపై చెట్టు కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.