ఖిలావరంగల్, ఫిబ్రవరి 16: మనఊరు.. మనబడి కార్యక్రమంలో మొదటి విడుతలో జిల్లాలోని 645 పాఠశాలలకు 223 స్కూళ్లను ఎంపిక చేసినట్లు కలెక్టర్ బీ గోపి తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. సర్కారు బడులను పటిష్టం చేసి ప్రగతి సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇంజినీరింగ్ శాఖ చేయాల్సిన పనులను కలెక్టర్ వివరించారు. మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల పనుల లావాదేవీల కోసం, సేకరించిన విరాళాల వినియోగం కోసం ఎంపికైన పాఠశాలల్లో రెండు బ్యాంకు ఖాతాలను తెరిపించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, శ్రీవాత్సవ, డీఈవో వాసంతి పాల్గొన్నారు.
సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను విద్యార్థులు రూపొందించాలని కలెక్టర్ గోపి సూచించారు. నర్సంపేటలోని డఫోడిల్స్ హైస్కూల్ విద్యార్థి జాతీయస్థాయి ఇన్స్పైర్కు ఎంపికయ్యాడు. దీంతో విద్యార్థి వంశీ, గైడ్ టీచర్ బొంపెల్లి సాయికిరణ్రావు బుధవారం వరంగల్లో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలువుగా, వారిని అభినందించారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతుండడంతో విద్యార్థులు దాని నివారణకు స్ప్రాకేట్ సైడ్ స్టాండ్ రిట్రీవ్ ప్రాజెక్టును రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. డీఈవో వాసంతి, అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, శ్రీవాత్సవ కోట, సైన్స్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో రత్నమాల, కరస్పాండెంట్ చింతల నరేందర్ పాల్గొన్నారు.