నల్లబెల్లి, ఆగస్టు 17: మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను బుధవారం ఏడీఏ అవినాశ్వర్మ తనిఖీ చేశారు. అయితే, ఆవులు పడ్డ ఆర్నేళ్లకు బోయులు చేను వద్దకు వెళ్లిన చందంగా వ్యవసాయాధికారుల తీరు ఉందని మండలంలోని రైతులు విమర్శిస్తున్నారు. పంటలు సాగు చేసిన సయమంలో తనిఖీలు చేయని ఏడీఏ.. సీజన్ దాటిన తర్వాత వచ్చి ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేయడంలో ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పక్కనబెట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్ వ్యాపారులతో కుదుర్చుకున్న ఒప్పందాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రంగాపూర్ గ్రామానికి చెందిన రైతు భట్టు సాంబయ్య ఆరోపించారు. గతంలో ఫర్టిలైజర్ షాపుల్లో టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీ మందులు బయటపడ్డాయని, రోజులు గడుస్తున్నా షాపుల నిర్వాహకులపై వ్యవసాయాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులకు ప్రభుత్వం అందించే ఎరువులు, పురుగు మందు లు, విత్తనాల్లో ఎలాంటి అక్రమాలు జరుగకుండా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.