సుంకం చెల్లించకుండా ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొస్తున్న మద్యం (ఎన్డీపీఎల్) వరంగల్లో పట్టుబడుతుండడం చర్చనీయాంశమవుతోంది. కొందరు వ్యాపారులు ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ర్టాల నుంచి ఎన్డీపీ మద్యాన్ని రైలు మార్గం ద్వారా ఇక్కడకు తెస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వాహకులకు, మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. అక్కడ తక్కువ ధరపై లభిస్తున్న ఎన్డీపీఎల్ను ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. నిఘా కొరవడడంతో వ్యాపారులు ఎన్డీపీఎల్ బిజినెస్లో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
వరంగల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : అసాంఘిక శక్తులు కొందరు వరంగల్ను అడ్డాగా చేసుకుని దర్జాగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి గంజాయితో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్ముతున్నారు. కొద్ది నెలల నుంచి తనిఖీల్లో వీటిని పోలీసులు పలు ఇళ్లు, షాపుల్లో స్వాధీనం చేసున్నారు. వరంగల్లోని లక్ష్మీపురంలో ఓ వ్యక్తి బరి తెగించి లైసెన్సు గోదాములో కృత్రిమ కల్లు తయారు చేసి అమ్మకందారులకు సరఫరా చేస్తుండగా కొద్ది నెలల క్రితం పట్టుకున్నారు. లాడ్జిలతో పాటు ఇళ్లలో దాడులు జరిపి వ్యభిచారం, పేకాట శిబిరాల నిర్వాహకులను పలువురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇతర రాష్ర్టాల నుంచి సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్) వరంగల్లో అధికారులకు పట్టుబడుతుండడం చర్చనీయమైంది.
వ్యాపారులు కొందరు వివిధ రాష్ర్టాల నుంచి ఎన్డీపీ మద్యాన్ని రైలు మార్గం ద్వారా ఇక్కడకు తెస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వాహకుల్లో కొందరికి, మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో తక్కువ ధరపై లభిస్తున్న ఎన్డీపీఎల్ను ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. వరంగల్ రైల్వేస్టేషన్ ఎదుట ఆటోస్టాండ్ వద్ద గత మార్చి 16న తమను చూసి త్వరగా వెళ్తున్న ఓ అనుమానితుడిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగులతో పాటు మరో బ్యాగును తనిఖీ చేశారు. వాటిలో హర్యానా రాష్ర్టానికి చెందిన ఎన్డీపీఎల్ బాటిల్స్ 45 (ఒక్కో బాటిల్ 750ఎంఎల్) ఉన్నట్లు గుర్తించారు. వీటిని హర్యానా రాష్ట్రం నుంచి రైలు మార్గం ద్వారా తెచ్చిన వ్యక్తి గుగులోత్ ప్రకాశ్వాల్యగా విచారణలో వెల్లడైంది. ఇతడు కొంతకాలంగా హర్యానాలో తక్కువ ధరకు లభించే మద్యం కొనుగోలు చేసి వరంగల్కు రైలుమార్గం ద్వారా తెచ్చి ఇక్కడ వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. లాభార్జన కోసం ప్రకాశ్వాల్య ఈ పని చేస్తున్నాడని, హర్యానా రాష్ట్రం నుంచి ఎన్డీపీఎల్ వరంగల్కు తేవడమే వ్యాపారంగా పెట్టుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్శాఖలోని హైదరాబాద్ ఎస్టీఎఫ్ అధికారులు ఖిలావరంగల్ ఎక్సైజ్ అధికారులతో కలిసి ప్రకాశ్వాల్యను పట్టుకుని హర్యానా ఎన్డీపీఎల్ను స్వాధీనం చేసుకున్నారు.
రైళ్ల ద్వారా వస్తున్న ఎన్డీపీఎల్
ఇతర రాష్ర్టాల నుంచి ఎన్డీపీఎల్ వరంగల్కు ఎక్కువగానే వస్తున్నట్లు ఇటీవలికాలంగా జరిగిన వరస ఘటనలు ధ్రువీకరిస్తున్నాయి. ఇక్కడి వ్యాపారులు కొందరు ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర రాష్ర్టాల్లో ఎన్డీపీఎల్ కొనుగోలు చేసి ట్రాలీబ్యాగులతో పాటు ఇతర బ్యాగుల ద్వారా వరంగల్కు చేరుస్తున్నారు. ఇతరులకు కనపడుకుండా బ్యాగుల్లో భద్రపరిచి రైళ్ల ఏసీ కోచ్ల్లో ప్రయాణిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సంపన్నులు ప్రయాణించే కోచ్ల్లో ప్రయాణం సాగిస్తున్న సదరు వ్యాపారులు వరంగల్ రైల్వే స్టేషన్లో దిగిపోతున్నారు. ఇక్కడి నుంచి ఆటోలు లేదా అప్పటికే తమ కోసం రైల్వే స్టేషన్ ఎదుట సిద్ధంగా ఉన్న సొంత వాహనాల్లో ఎన్డీపీఎల్ను తీసుకెళ్లి అమ్ముతున్నారు. వీరిలో కొందరు తమ రెగ్యులర్ కస్టమర్లకు విక్రయిస్తుండగా మరికొందరు బెల్ట్ షాపుల నిర్వాహకులకు ఇస్తున్నారు. పెట్టుబడిపై రెండురెట్లు లాభం వస్తుండడంతో ఇదే పనిగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ర్టాలకు వెళ్లి ఎన్డీపీఎల్ తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక్కడ అమ్మకాలు జరిగే కంపెనీల మద్యంలో ఇతర రాష్ర్టాల్లో తక్కువ ధరకు లభించే కంపెనీల మద్యం కొని తెస్తున్నారు. ఉదాహరణకు ఇతర రాష్ర్టాల్లో రూ.600కు లభించే ఒక మద్యం బాటిల్ను ఇక్కడ రూ.1,600 చొప్పున అమ్ముతున్నారు. దీంతో ఈ బిజినెస్ లాభదాయకంగా ఉండడంతో వ్యాపారులు ఎన్డీపీఎల్ విక్రయాలు సాగిస్తున్నారు. ఖిలావరంగల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కేవలం రెండు నెల వ్యవధిలో ఐదు ఎన్డీపీఎల్ కేసులు నమోదయ్యాయి.
వీటిలో ఓ కేసులోని నిందితుడు హనుమకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వ్యాపారిగా తేలింది. అతడు ఇతర రాష్ర్టాల నుంచి ఎన్డీపీఎల్ తెచ్చి ఇక్కడ అమ్మకందారులకు ఇస్తాడని ఎక్సైజ్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. తాజాగా ఈ నెల 12న ఎన్డీపీఎల్ కలిగి ఉన్న జయశంకర్భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల గ్రామస్తుడు అల్లె రాంకిషన్ను వరంగల్ రైల్వేస్టేషన్ ఎదుట గల ఆటోస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న బ్యాగులో ఢిల్లీ రాష్ర్టానికి చెందిన 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే, మరో మూడు కేసుల్లోనూ ముగ్గురు వ్యక్తులను ఇక్కడ అరెస్టు చేసి ఇతర రాష్ర్టాల మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ఎన్డీపీఎల్ తెస్తున్న వ్యాపారుల్లో కొందరు అనూహ్యంగా ఎక్సైజ్ అధికారులకు చిక్కుతుంటే మరెందరో రైలు దిగగానే వ్యూహాత్మకంగా వెంట ఉన్న ఎన్డీపీఎల్ను ఇతరుల కంటపడకుండా తమ స్థావరాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. నిఘా కొరవడడంతో వ్యాపారులు ఎన్డీపీల్ బిజినెస్లో పోటీ పడుతున్నట్లు సమాచారం. ఎన్డీపీఎల్ అమ్మకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుంది.