వరంగల్, ఆగస్టు 17: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో సిటిజన్ చార్టర్ను పటిష్టంగా అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్, రెవెన్యూ అధికారులు, ఆర్ఐలతో బుధవారం ఆమె సమీక్షించారు. సర్కిళ్ల వారీగా పన్నుల వసూళ్ల పురోగతి, పెండింగ్ ఫైళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పౌరసేవలపై నిర్దేశించిన సిటిజన్ చార్టర్ ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్ కార్యాలయాల్లో పక్కాగా అమలు చేయాలని సూచించారు.
కార్పొరేషన్కు వివిధ పనులపై వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సిటిజన్ చార్టర్ అమలు చేయాలన్నారు. ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు, ఆస్తి పేరు మార్పిడి, బైపర్కేషన్, కొత్త ఇంటి నంబర్ల కేటాయింపులు సిటిజన్ చార్టర్ గడువులోగా పూర్తి చేయాలన్నారు. నిబంధనల మేరకు ఫైళ్ల పరిష్కారం పారదర్శకంగా జరుగాలన్నారు. సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే వెంటనే డిప్యూటీ కమిషనర్లు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాశీబుగ్గ సర్కిల్లో పెండింగ్లో ఉన్న 286 ఫైళ్లు, కాజీపేట సర్కిల్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న 328 ఫైళ్లను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు.
జియో ట్యాంగింగ్ చేయాలి
గ్రేటర్ పరిధిలో వంద శాతం గృహాలకు జియో ట్యాగింగ్ చేయాలని మేయర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 70 శాతం గృహలకు మాత్రమే జియో ట్యాంగింగ్ పూర్తి చేశారని, మిగితా గృహాలకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. కొత్త గృహాలను గుర్తించి అస్సెస్మెంట్, ట్యాక్స్ మదింపు చేయాలన్నారు. ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు ఇచ్చిన వన్టైం స్కీంను బడా పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను బకాయిదారులు వన్టైం స్కీం ద్వారా 90 శాతం అపరాధ రుసుం మాఫీ అవకాశం వినియోగించుకోనేలా అవగాహన కల్పించాలన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 88.91 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఇప్పటి వరకు కేవలం రూ. 32.18 కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని తెలిపారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్ జోనా, ఐటీ మేనేజర్ రమేశ్, లీగల్ అధికారి శ్రీనివాస్, ఆర్వోలు సుదర్శన్, యూసుఫొద్దీన్, శ్రీనివాస్, షహజాదీబేగం పాల్గొన్నారు.