వర్ధన్నపేట/పర్వతగిరి, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండా, నీలగిరిస్వామి, గుబ్బెటితండాలో గురువారం జరిగిన తీజ్ వేడుకల్లో ఆయన పాల్గొని మహిళలు, యువతలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ పండుగలు, సంప్రదాయాలను తుంగలో తొక్కారన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉత్సవాలకు పూర్వ వైభవం తెస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, జడ్పీటీసీ మార్గం భిక్షపతి పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని ఉట్టితండా, బోటికాడితండాలో నిర్వహించిన తీజ్ వేడుకలకు అరూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ ఉత్సవంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం డప్పువాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో గిరిజన యువతులతో కలిసి అరూరి నృత్యం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, మనోజ్కుమార్గౌడ్, చిన్నపాక శ్రీనివాస్, సర్పంచ్ ప్రమీలాగోపి పాల్గొన్నారు.
అన్ని మతాలను గౌరవిస్తున్న సీఎం..
గీసుగొండ: మండలంలోని విశ్వనాథపురం, నందనాయక్తండాలో తీజ్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. గోధుమనారు బట్టను ఆయన ఎత్తుకొని గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. రాష్ట్రంలో అన్ని మతాలను సీఎం కేసీఆర్ గౌరవిస్తున్నట్లు చల్లా తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్లు నాగేశ్వర్రావు, అమ్మి, సరోజ, నాయకులు రవీందర్, స్వామి, కొమురయ్య, రవీందర్రెడ్డి, తిరుపతి, రాజు, రమేశ్, అఖిల్ రాజు, సురేందర్, జీవన్ పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్
దుగ్గొండి: గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని రాజ్యాతండా సర్పంచ్ బానోత్ రవీందర్నాయక్ అన్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో తీజ్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గిరిజనుల పండుగలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భావితరాలకు మన సంప్రదాయాలను తెలియజేయాలని సూచించారు. అనంతరం యువతులతో కలిసి గోధుమనారు బుట్టలను ర్యాలీగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.