ఖిలావరంగల్, ఆగస్టు 10 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ఓసిటీ స్టేడియం వరకు నిర్వహించే ఫ్రీడమ్ రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ బీ గోపి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రీడమ్ రన్లో క్రీడాకారులు, యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 15న స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించే ఖిలావరంగల్లోని ఖుష్మహల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ముఖ్య అతిథి, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దార్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాల రక్షా భవన్ సందర్శన..
పోచమ్మమైదాన్ : లైంగిక వేధింపులకు గురైన బాలిలకు ఆర్థిక పరిహారం అందిస్తూ, వారికి తగిన సేవలు అందించాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని బాల రక్షా భవన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లైంగిక నేరా ల నుంచి బాలలను రక్షించే చట్టం-2012 కింద నమోదవుతున్న ఫిర్యాదుల ఎఫ్ఐఆర్, మెడికల్ రిపోర్టులు తెప్పించుకోవాలని, చిన్నారులకు పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీసుల సహకారంతో తప్పిపోయిన పిల్లల వివరాలు తెలుసుకోవాలన్నారు. అనంతరం చైల్డ్ హెల్ప్లైన్ 1098 రికార్డులు పరిశీలించారు. బాలల సంరక్షణకు సంబంధించిన నివేదికను నెలవారీగా అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శారద, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, డీసీపీవో మహేందర్రెడ్డి, బాలల సంక్షేమ సమితి సభ్యులు రామలీల, మధు, షహేదాబేగం, సుజాత, చైల్డ్లైన్ కో ఆర్డినేటర్ వీరబాబు పాల్గొన్నారు.