వజ్రోత్సవాల సందర్భంగా వనమహోత్సవం జోరుగా సాగింది. గ్రామాలు, పట్టణాల్లోని పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమం పచ్చని పండుగను తలపించింది. ద్విసప్తాహ సంబురాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం ఉమ్మడి జిల్లా అంతటా కార్యక్రమాలు జోరుగా సాగాయి. పార్కులతో పాటు పాఠశాలలు, పోలీస్స్టేషన్లు, కార్యాలయాలు.. ఇలా అన్నిచోట్లా మొక్కలునాటారు. పలుచోట్ల భారతదేశ చిత్రపటం ఆకారంలో మూడు రంగులద్ది మొక్కలను అమర్చారు. అనంతరం మువ్వన్నెల జెండా చేతబూని జై భారత్-జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దేశభక్తిని చాటుతూ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో విద్యార్థులు, నాయకులు, సింగరేణి ఉద్యోగులు, కార్మికులు జాతీయ జెండాలు చేతబూని వీధుల్లో తీసిన ర్యాలీలు ఆకట్టుకున్నాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆరెగూడంలో కలెక్టర్ గోపి, డీఎఫ్వో అర్పనతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫ్రీం పార్కు ను ప్రారంభించి మొక్కలు నాటారు. ఆ తర్వాత చిన్నారులతో కలిసి జాతీయ జెండాలు పట్టుకొని పార్కు చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కులో మహాత్ముడి విగ్రహానికి మంత్రి సత్యవతిరాథోడ్ నివాళులర్పించి వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి 75 మొక్కలు నాటారు. వరంగల్ కమిషనరేట్లో సెంట్రల్ డీసీపీ అశోక్, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, సిబ్బందితో కలిసి సీపీ తరుణజోషి మొక్కలు నాటారు. వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. హనుమకొండ బాలసముద్రం పార్క్లో 75 వసంతాలకు గుర్తుగా ఏర్పాటుచేసిన గ్రీనరీ చూడముచ్చటగా ఉంది. కమిషనరేట్, ధర్మసాగర్ పీఎస్లో సీపీ తరుణ్జోషి, ఎమ్మెల్యే రాజయ్య మొక్కలు నాటారు. జనగామ 1వ వార్డులోని ఫ్రీడం పార్కులో డీసీపీ సీతారాం, మున్సిపల్ చైర్మన్ పోకల జమునతో కలిసి కలెక్టర్ శివలింగయ్య మొక్కలు నాటారు. పార్కులో 75 ఆకృతిలో పూల మొక్కలు నాటిన తీరు ఆకట్టుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం, వెంకటాపూర్(నూగూరు) తాసిల్ వద్ద కలెక్టర్ కృష్ణ ఆదిత్య మొక్కలు నాటారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి కలెక్టర్ భవేశ్మిశ్రా వనమహోత్సవంలో పాల్గొన్నారు. – నమస్తే నెట్వర్క్