రాయపర్తి, ఆగస్టు 10: వెంకటేశ్వపల్లిలోని స్వయంవ్యక్త శ్రీవెంకటేశ్వస్వామి ఆలయానికి అనతి కాలంలోనే మహర్దశ పట్టింది. గత ఫిబ్రవరి 11న జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయ భవన ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరైన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్నూరు ఆలయాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. నాడు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎత్తైన ధ్వజ స్తంభంతో సుమారు 800 ఏళ్లకు పూర్వం గ్రామంలోని గుట్ట ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన స్వామి వారికి ఆనాడు ఏకశిలా నగరాన్ని పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల పరిపాలనా కాలంలో స్వామి వారి భక్తులు ఆలయ నిర్మాణం గావించినట్లు ఇక్కడి పూర్వీకులు చెబుతుంటారు.
శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారి ఆలయం పూర్తిగా శిలా నిర్మితం. ఆలయంతోపాటు కల్యాణ మండపం, గర్భగుడి, యాగశాలలు, కోనేరు, భక్తులు, అనువంశిక ధర్మకర్తలు, అనువంశిక పూజారులు, సేవకుల కోసం విడిది మంటపాలతో ఆలయ నిర్మాణం గత ప్రభుత్వాల ఆధరణ లేకపోవడంతో కాలక్రమేణా జీర్ణొద్ధరణకు చేరుకుంటున్నాయి. ఏటా స్వామి వారికి నిర్వహించే వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలతోపాటు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, పూజారుల పోషణార్థం ఆనాడు స్వామి వారి భక్తులు, ధర్మకర్తలు ఆలయానికి సమకూర్చిన సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూములు కౌలుదారుల చేతుల్లో ఉండడం, ఆలయ భూముల నుంచి స్వామి వారికి దమ్మిడి ఆదాయం రాకపోవడంతో ఏటా స్వామి వారి కల్యాణోత్సవాలు భక్తులు సమర్పించే కానుకలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ క్రమంలో సన్నూరు ఆలయాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.