స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో 202 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం 182 మందికి మాత్రమే విధుల్లో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో వీరు ఎంపీడీవోలకు రిపోర్టు చేస్తున్నారు. ఇప్పటికే 79 మంది విధుల్లో చేరినట్లు డీఆర్డీవో వెల్లడించారు. ప్రభుత్వం ఇంకో అవకాశం ఇవ్వడంతో ఫీల్డ్ అసిస్టెంట్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్, ఆగస్టు 10 (నమస్తేతెలంగాణ) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టే పనుల నిర్వహణకు ప్రభుత్వం 2007లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. అప్పట్లో నెలకు రూ.1,200 వేతనంతో కొలువులో చేరిన ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనం కొద్ది నెలల్లో రూ.10 వేలకు పెరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పని చేసేవారు. ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రాయడంతో పాటు పనులను పర్యవేక్షించేవారు. కూలీలకు జాబ్ కార్డులు ఇప్పించడం, వాటిని అప్డేట్ చేయడం, రికార్డులు నిర్వహించడం, జాబ్కార్డు ఉన్నవారి నుంచి ముందుగానే డిమాండ్ తీసుకుని వారికి పని ఇప్పించడం వంటివి చేసేవారు. చేసిన పనులకు సంబంధించి కొలతల ప్రకారం కూలీలకు ఉపాధి హామీ పథకం నుంచి డబ్బు విడుదల చేయించేవారు. స్థానిక ఎంపీడీవో, ఏపీవో పర్యవేక్షణలో వీరు విధులు నిర్వర్తించేవారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో కీలక భూమిక పోషించిన ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు వేతనాలు ఎస్టీవోల నుంచి ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగారు. 2020 మార్చిలో సమ్మెలోకి వెళ్లిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. వీరి బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి గ్రామాల్లో పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లు, సీనియర్ మేట్ల సహకారంతో కార్యదర్శులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు.
28 నెలల తర్వాత విధుల్లోకి..
సమ్మెలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలని పలు సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే పని చేస్తామని, తమకు పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిశారు. వీరి ప్రతిపాదనను మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ఇటీవల హామీ ఇచ్చారు. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోల వద్ద రిపోర్టు చేయాలని జిల్లాలోని పీల్డ్ అసిస్టెంట్లకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సమ్మెకు దిగిన 28 నెలల తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు మెసేజ్ అందిన వెంటనే విధుల్లో చేరేందుకు మండల పరిషత్ కార్యాలయాల దారి పట్టారు. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో 79 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరినట్లు సమాచారం వచ్చిందని డీఆర్డీవో సంపత్రావు వెల్లడించారు. అర్హత గల మిగతా ఫీల్డ్ అసిస్టెంట్లు నేడో రేపో విధుల్లో చేరుతారని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు భావిస్తున్నారు.
పాత గ్రామ పంచాయతీల్లోనే..
2007లో గ్రామ పంచాయతీకో ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించారు. మూడేళ్ల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే ఉపాధి హామీ పనులను పర్యవేక్షిస్తున్నారు. పాత గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో 202 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా వీరిలో ప్రస్తుతం 182 మంది మాత్రమే తిరిగి విధుల్లో చేరేందుకు అర్హులని అధికారులు తెలిపారు. మిగతా ఇరవై మందిలో కొందరిపై సస్పెన్షన్ వేటు పడగా మరికొందరు విధులకు దూరమైనట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పుడు మొత్తం 323 గ్రామ పంచాయతీలు ఉంటే వీటిలో 182 పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తించే అవకాశం ఉంది.