వరంగల్, జూలై 22: గ్రేటర్ పరిధిలోని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్లో ప్రజారోగ్య విభాగం అధికారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ఆటోల పనితీరు, పారిశుధ్య నిర్వహణ అంశాలపై ఆమె సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వంద శాతం ఇంటింటా చెత్త సేకరణ చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్వచ్ఛ ఆటోలు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేసేలా పటిష్ట రూట్ మ్యాప్ రూపొందించి, దానికి అనుగుణంగా ట్రిప్పులను నిర్ణయించాలన్నారు. చెత్త సేకరణను శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
చెత్త సేకరణలో ఇంటి యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి వేతనాల్లో కోత విధించాలని ఆమె ఆధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని అన్నారు. 6 డివిజన్లకు ఒక కంపాక్టర్ను ఏర్పాటు చేసి స్వచ్ఛ ఆటోలు సేకరించిన చెత్తను టాన్స్ఫర్ స్టేషన్లకు బదులు కంపాక్టర్ బిన్లలో వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా జరుగాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, డిప్యూటీ కమిషనర్లు జోనా, శ్రీనివాస్రెడ్డి, ఎంహెచ్వో రాజేశ్, ఈఈ లక్ష్మారెడ్డి, డీఎస్వో వేణుగోపాల్, సూపరింటెండెంట్ దేవేందర్ పాల్గొన్నారు.
స్వానిధి మహోత్సవ్కు ఏర్పాట్లు చేయాలి
స్వానిధి మహోత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మెప్మా అధికారులు, సీవోలతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 30న అంబేద్కర్ భవన్లో స్వానిధి మహోత్సవ్ను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు ఇండోర్ గేమ్స్ నిర్వహించాలని చెప్పారు. డిజిటల్ ద్వారా వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు, పెద్ద ఎత్తున స్వానిధి రుణాలు మంజూరు చేసిన బ్యాంకు అధికారులను సన్మానించాలని కోరారు. అదనపు కమిషనర్ అనీసుర్ష్రీద్, మెప్మా పీడీ భద్రునాయక్, టౌన్ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీఎంసీలు రజితారాణి, రేణుక, టీఎంసీ రమేశ్, సీవోలు పాల్గొన్నారు.