నెక్కొండ, జూలై 9: పేదరికం ఆ కుటుంబానికి శాపమైంది. కూలీనాలి చేసి జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా వచ్చిన మాయరోగం ఉక్కిరిబిక్కిరి చేసింది. తన భార్యను రక్షించుకునేందుకు భర్త చేసిన ప్రయత్నాలన్నీ ఆవిరయ్యాయి. భార్య మృతితో నిస్సహాయస్థితిలో భర్త రోదిస్తుండగా.. తల్లిని కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని చిన్నకోర్పోలులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… చిన్నకోర్పోలుకు చెందిన మాతంగి సదయ్యకు భార్య శారద(28), ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన ఓ ఆసామి వద్ద పాలేరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సదయ్య భార్య శారదకు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత వ్యాధి వచ్చింది. దీంతో అతడు తాను పని చేస్తున్న ఆసామి వద్ద లక్ష రూపాయలు అప్పు చేసి పలు దవాఖానల్లో వైద్యం చేయించాడు. అయినా నయం కాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నెల రోజుల క్రితం శారద ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెకు రంధ్రం పడిందని, ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆర్థిక స్తోమత లేని సదయ్య ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండగా, దవాఖానలో చికిత్స పొందుతుండగానే శారద శనివారం తుదిశ్వాస విడిచింది. కాగా, సదయ్యకు కుమార్తెలు పునూష(10), మధుప్రియ(8), లాస్య(6) ఉన్నారు. అమ్మ గుండెపై పడి ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు విలపిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందోనని బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలను ఆపన్నులు ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, స్థానికులే విరాళాలు సేకరించి శారద అంత్యక్రియలు నిర్వహించారు.