సుబేదారి, జూలై 6: గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 కిలోల గంజాయి, డోజర్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ నలుగురు నిందితుల అరెస్టును చూపించారు.
జగిత్యాల జిల్లాకు చెందిన సూర్యటి వెంకన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా ధారకొండ గ్రామంలో నివాసముంటున్నాడు. అదే గ్రామానికి చెందిన కొమిరి రాములు మహబూబాబాద్ జిల్లాకు చెందిన భూక్యా శంకర్, బానోత్ శ్రీనివాస్తో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. గతంలో వెంకన్న, శంకర్ కలిసి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించేవారు. వీరిద్దరితో శ్రీనివాస్, రాములు కలిసి ధారకొండలో కిముడు వద్ద 200 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా రెండు డ్రమ్ము ల్లో భద్రపరిచారు.
కొమిరి రాములుకు చెందిన డోజర్ ట్రాక్టర్ ద్వారా భద్రాచలం, ఖమ్మం, కొడకండ్ల మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో కొడకండ్ల పోలీసుల సహకారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు కొడకండ్ల మండలం మొండ్రాయి క్రాస్రోడ్డు వద్ద బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 200 కిలోల గంజాయి, ట్రాక్టర్ డోజర్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ సీఐలు సంతోష్, శ్రీనివాస్జీ, పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సైలు లవన్కుమార్, కొమురెల్లి, సిబ్బందిని పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అభినందించారు.