వర్ధన్నపేట, జూలై 6: పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దివిటిపల్లిలో ఇటీవల ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన కూనూరు యాదగిరి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొత్తపల్లికి చెందిన జన్ను సంతోష్ టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరి కుటుంబాలకు పార్టీ చేయించిన ఇన్సూరెన్స్కు సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు బుధవారం అరూరి పార్టీ శ్రేణులతో కలిసి బాధితుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు పార్టీ తరఫున బీమా చేయించారని గుర్తుచేశారు. ప్రమాదంలో కార్యకర్త మృతి చెందితే అతడి కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సొమ్ము అందజేస్తున్నట్లు వివరించారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
మహిళా భవన నిర్మాణానికి నిధులు
ఇల్లందలో మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో గ్రామానికి చెందిన మహిళా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. ఇల్లందలో ఆరు గ్రామైక్య సంఘాల కోసం త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ఖన్నా, ఏఎంసీ చైర్మన్ కమ్మగోని స్వామిరాయుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.