నర్సంపేటరూరల్, జూలై 5: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పడుతాయని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ కే వెంకటలక్ష్మి అన్నారు. మండలంలోని ముత్తోజిపేటలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆమె ప్రారంభించారు. ముందుగా ఆమె గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ నేర రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
పిల్లలకు బైక్లు ఇవ్వొద్దని, వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బ్యాంకుల పేరుతో సెల్కు వచ్చే మెస్సెజ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ సంపత్రావు, టౌన్ సీఐ పులి రమేశ్, ఎస్సైలు బొజ్జ రవీందర్, రాంచరణ్, సర్పంచ్ గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ గంగిడి సాంబరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ రాయిశెట్టి బుచ్చయ్య, వార్డు సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామస్తులకు డీసీపీ అభినందన
దుగ్గొండి: గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామస్తులు, కృషి చేసిన పోలీసులను డీసీపీ వెంకటలక్ష్మి అభినందనలు తెలిపారు. గిర్నిబావిలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను స్థానిక పోలీసులు, ప్రజాప్రతినిధులతో కలిసి వెంకటలక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలను అదుపు చేయాలంటే గ్రామ కూడళ్లు, కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. గిర్నిబావిని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అనుమానితులు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో దుగ్గొండి రూరల్ సీఐ సూర్యప్రసాద్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ ఎస్సైలు నవీన్కుమార్, తోట మహేందర్, సీమ పర్హీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.