‘మన ఊరు-మన బడి’తో సర్కారు పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా రాష్ట్ర సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు ఆంగ్ల బోధనను అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణలో సమూల మార్పులు చేసింది. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలను ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్లో ముద్రించింది.
మన ఊరు-మన బడితో విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. దశలవారీగా పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని సర్కారు స్కూళ్లల్లో ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నది. ఇందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. కాగా, ఇన్నాళ్లు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు ఒకేసారి ఇంగ్లిష్లో పాఠాలు అర్థం చేసుకోవడం కష్టమని భావించిన సర్కారు, ఈసారి పాఠ్యపుస్తకాలను రెండు భాషల్లో ముద్రించింది.
సబ్జెక్టు పుస్తకంలో ఒక పాఠం ఒకవైపు ఇంగ్లిష్లో.. మరోవైపు తెలుగులో ఉండేలా ముద్రించారు. రెండు భాషల్లో పాఠాలు ఉండడంతో పేజీల సంఖ్య పెరిగినా విద్యార్థులకు సులువుగా అర్థమవుతున్నది. అదేవిధంగా ఉపాధ్యాయుల బోధనకు అనువుగా ఉన్నాయి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఈ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 872, గురుకులాలు 98, కేజీవీబీలు 16, మోడల్ స్కూళ్లు 8 ఉండగా, 54వేల మంది విద్యార్థులు చదువుకుకుంటున్నారు. వీరందరికీ పాఠ్యపుస్తకాలు అందిస్తున్నది. తెలుగు, ఇంగ్లిష్లో పాఠ్యప్తుకాలు ఉండడంతో పాఠాలు సులువుగా అర్థమవుతున్నాయని విద్యార్థులు కూడా సంబురపడుతున్నారు.
సులభంగా అర్థం చేసుకుంటారు..
నూతనంగా ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో ఒకే పాఠం ఇంగ్లిష్, తెలుగులో ఉండడంతో విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. రెండు భాషల్లో పుస్తకాలు ఉండడం వల్ల ఉపాధ్యాయులకు బోధించడం కూడా సులువుగా మారింది. విద్యార్థులు ఒకటి రెండు సార్లు ఇంగ్లిష్ పాఠాలు చదివితే అలవాటుగా మారి భాషను సులువుగా నేర్చుకుంటారు.
– పీ శ్రీను, ఉపాధ్యాయుడు, కొమ్ములవంచ
ఇంగ్లిష్ చదవడం ఈజీగా ఉంది
ఇంగ్లిష్లో చదవడం అంటే భయంగా ఉండేది. కొత్త పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లిష్తో పా టు తెలుగులో పాఠా లు ఉండడంతో సులువుగా అర్థమవుతున్నా యి. ఆంగ్లభాష నేర్చుకోవడం సులభంగా ఉంది. ఇప్పటివరకు తెలుగు మీడియంలో చదువుకున్న. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విని భాషను నేర్చుకుంటున్న.
– వసంశెట్టి అక్షిత, 4వ తరగతి