నర్సింహులపేట, జూలై 3 : వ్యవసాయానికి ఆధారం కాడెడ్లు. అందుకే రైతులు వాటిని ప్రాణంలా చూసుకుంటారు. సాగు పనుల్లో కీలక పాత్ర పోషించే ఈ ఎడ్లను అన్నదాతలు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. చెలకలో గొర్రు తోలడం పత్తి, మిరుప నాటేందుకు అచ్చు చేయడం, పొలాన్ని చదును చేసి విత్తనాలు వేయడం, కలుపు తగ్గించేందుకు గుంటుక తోలడం వంటి పనులకు ఎడ్లను ఉపయోగించడం పరిపాటి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లోకి అత్యాధునిక యంత్రాలు వచ్చినా ఎడ్లకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. పత్తి విత్తేందుకు తప్పనిసరిగా అచ్చు వేయడం కోసం కాడెడ్లు అవసరం ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగింది.
అరకతోనే అధిక లాభాలు
విత్తనాలు వేసేందుకు ఎడ్లతో దున్నే నాగలితో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ట్రాక్టర్ల అద్దె, కూలీలకు పని పెరుగడంతో కాడెడ్లకు డిమాండ్ పెరిగింది. ఎడ్లతో పొలంలో మట్టిని తిరిగి వేయడంతో పాటు వరం దగ్గరగా దున్నడం వల్ల ఫలితం బాగుంటుంది. అందుకే లక్ష పెట్టి కాడెడ్లను కొనుగోలు చేశాను.
– లకావత్ బిచ్చునాయక్
పల్లెల్లో మస్తు ఉపాధి
గ్రామాల్లో కాడెడ్లున్న వారికి ఉపాధి దొరుకుతోంది. చెలకలో గొర్రు, అచ్చు వేయడం, విత్తనాలు వేసేందుకు, గుంటుక తోలే పనులతో రోజుకు రూ.1300 దాకా గిట్టుబాటు అవుతోంది. ఖర్చుల కింద మరో రూ.200 కూడా ఇస్తున్నారు. ఇలా ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 దాకా వ్యవసాయ పనులతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వర్షాలు కూడా మొదలవడంతో పత్తి అచ్చు వేసేందుకు ముందే డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి మరీ పనులు చేయించుకుంటున్నారు.
చేతినిండా పని..
గతంలో రైతులు తమ ఇండ్లలో వ్యవసాయ పనులకు, మరికొన్ని ఆవులు, పాడి గేదెలు పెంచుకునేవారు. వాటికి మేత కోసం కొంత భూమిని వదిలి వేసేవారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో యంత్రాలు ఎక్కువ వచ్చి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు వ్యవసాయ పనుల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ నాగళ్లలో విత్తనాలు వేయడం, గుంటుక తోలడం, పొలం దున్నడం, గొర్రు తోలడం వంటి పనులు చేసుకునేవారు. పశుగ్రాసం, కూలీల కొరతతో పాటు చిన్న, సన్నకారు రైతులకు పశుపోషణ భారమై గ్రామాల్లో పశువుల సంఖ్య క్రమేపీ తగ్గింది. ఆధునిక వ్యవసాయ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవసాయ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు రాయితీపై అందించడంతో గ్రామాల్లో, తండాల్లో ట్రాక్టర్ల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కొందరు రైతులు మాత్రం నేటికీ కాడెడ్లతో వ్యవసాయం చేస్తున్నారు. పంటల్లో కలుపు తీసేందుకు ట్రాక్టర్లు, ఇతర యంత్రాల కంటే ఎడ్లతోనే ఎక్కువ ఉపయోగం ఉండడం వల్ల ఎడ్లున్న రైతులకు చేతినిండా పని ఉంటోంది.