పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి తొలి విడుత ఎకరానికి రూ.5వేల చొప్పున పంపిణీ చేయనుంది. గతంలో మాదిరిగా తక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారికి తొలుత.. ఇలా ఎకరాల వారీగా ఆర్థికసాయం అందనున్నది. జిల్లాలో మొత్తం 1,49,837 మంది రైతులు లబ్ధిపొందనుండగా, నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. రూ.136,32,97,679 పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల పంట పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లు దాటిన నేపథ్యంలో రైతులు ఊరూరా సంబురాలు నిర్వహించారు. కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఇక్కడి రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు భరోసా ఇస్తున్నారని కొనియాడారు.
వరంగల్, జూన్ 27(నమస్తేతెలంగాణ) : పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు మంగళవారం నుంచి రైతుబంధు పథకం ద్వారా ఆర్థికసాయం అందనుంది. వానకాలం పంట పెట్టుబడి కోసం తొలి విడుత ఎకరానికి రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వెలిబుచ్చుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది.
ఏటా ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు విడుతల్లో రూ.10 వేలు అందజేస్తున్నది. 2018-19 వానకాలం సీజన్ నుంచి గత యాసంగి వరకు రూ.50,448 కోట్లు పంపిణీ చేసింది. పంట పెట్టుబడి సాయం రూ.50 వేల కోట్లు దాటిన నేపథ్యంలో ఇటీవల రైతులు ఊరూరా సంబురాలు నిర్వహించి, సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ ఏడాది తొలివిడుత కింద రాష్ట్రంలోని రైతులకు రూ.7,500 కోట్ల ఆర్థికసాయం అందజేయనుంది. కొద్ది రోజుల నుంచి వానలు పడుతుండడంతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. పత్తి, మక్కజొన్న, వేరుశనగతో పాటు ఇతర విత్తనాలను నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎరువుల కొనుగోలు, ఇతర అవసరాలకు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి డబ్బులు అందజేయాలని సీఎం కేసీఆర్ బుధవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జిల్లాలో 1,49,837 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. పెట్టుబడి కోసం ప్రభుత్వం రూ.136,32,97,679 అందజేయనుంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రైతుబంధు నిధులతో విత్తనాలు, ఎరువులు కొనేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ప్రభుత్వం సుమారు 53 వేల మంది రైతుల కోసం రూ.16.08 కోట్లను ట్రెజరీకి పంపింది. తొలిరోజు ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం జమకానుంది. రెండో రోజు 2, మూడో రోజు 3, నాలుగో రోజు 4 ఎకరాల్లోపు గల రైతులకు ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.