కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతున్నా టీఆర్ఎస్ సారధ్యంలోని రాష్ట్ర సర్కారు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ గోపితో కలిసి రాయపర్తి మండలంలోని కాట్రపల్లిలో పర్యటించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని అన్నారు. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నామన్న అక్కసుతోనే ప్రతిపక్ష నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మొదలు పెట్టారని విమర్శించారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ప్రజల సహకారంతోనే విజయవంతమైందన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పార పట్టి చెత్తను ట్రాక్టర్లో పోశారు. జీపీ సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.
– రాయపర్తి, జూన్ 15
రాయపర్తి, జూన్ 15 : కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన అందిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా బుదవారం కాట్రపల్లి గ్రామంలో కలెక్టర్ బీ గోపి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాల సమీపంలో రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత, క్రీడాకారులతో మంత్రి ఎర్రబెల్లి కాసేపు వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మోటర్ సైకిళ్లతో ర్యాలీగా వెళ్లి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్ బోనగరి పురుషోత్తంతో మాట్లాడి పలు సూచనలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు ప్రారంభించారు.
తట్టలు మోసిన మంత్రి ఎర్రబెల్లి..
పల్లె ప్రగతి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా కాలినడకన జిల్లా ఉన్నతాధికారులతో కలసి స్థానిక అంగడి మైదానంలో పర్యటించారు. అక్కడ పారిశుధ్య పనులు చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి స్వయంగా కార్మికులతో కలసి పారతో చెత్తను తట్టల్లోకి ఎత్తుతూ, తట్టలు మోస్తూ ట్రాక్టర్లో చెత్త నింపారు. వన నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన ఆయన పల్లె ప్రగతి పనుల నిర్వహణలో శక్తివంచన లేకుండా పనిచేస్తున్న గ్రామ సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలక వర్గాలను అభినందించారు.
కేంద్రానిది సవతి తల్లి ప్రేమ..
మన ఊరు-మన బడి కార్యక్రమాలలో బాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో రూ.84 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి అధికారులతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు.
ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు కోట్లాది రూపాయల వ్యయంతో సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదరణను చూసి తట్టుకోలేక కేంద్రం అయోమయాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఉనికి కోల్పోతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ అబద్ధపు ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, కరోనా రక్కసి కారణంగా మూడేళ్ల పాటు ఆర్థికంగా నష్టాలు చవిచూసినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజల సంపూర్ణ సహకారంతోనే పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నట్లు తెలిపారు. గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.3.05 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం..
అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ మహ్మద్ యాకూబీ, సూపర్వైజర్ సత్యవతితో కలసి మంత్రి ఎర్రబెల్లి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మండల పశు వైద్యాధికారి వీరగోని శ్రుతి అభ్యర్థన మేరకు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు తాగించారు. గ్రామ శివారులో మొక్కలు నాటి నీళ్లు పట్టారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, డీపీవో నాగపురి స్వరూప, డీఎల్పీవో ప్రభాకర్, జడ్పీ సీఈవో రాజారావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ఎంపీటీసీ బిజ్జాల సంధ్యాసోమనాథం, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభధ్రం, ఏపీఎం పులుసు అశోక్కుమార్, ఏపీవో దొనికెల కుమార్గౌడ్, పలు విభాగాల ఏఈలు, డీఈలు బాబురావు, శివ ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్, మండల నాయకులు మండల శ్రీధర్, మహ్మద్.అన్వర్, కత్తి సోమన్న, ఉండాడి సతీశ్కుమార్, మహ్మద్ గుంషావలీ, ఎర్ర యాకూబ్, గుమ్మడిరాజుల శ్రీనివాస్, గిరుక సురేశ్, కత్తి యాకయ్య, మొర్రి రాజేందర్, చిడిమిల్ల అశోక్కుమార్, మండల నాయకులు కాంచనపల్లి వనజారాణి, ఎండీ నయీం, గబ్బెట బాబు, కర్ర రవీందర్రెడ్డి, సూదుల దేవేందర్రావు, గాజులపాటి నర్మద, కుందూరు రమేశ్రెడ్డి, కుక్కుడపు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.