కృష్ణకాలనీ, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దళితబంధుతో కూలీలు ఓనర్లు అయ్యారని.. యూనిట్లను సద్వినియోగం చేసుకొని దర్జాగా బతకాలని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 80మందికి రూ.8కోట్ల విలువైన యూనిట్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ దేశ చరిత్రలో దళితబంధు పథకం ఒక సాహసోపేత నిర్ణయమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 1500 నుంచి 2వేల చొప్పున రాష్ట్రంలో 17లక్షల మందికి దళితబంధు అందజేస్తామని చెప్పారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారని, వీటిని సక్రమంగా వినియోగంచుకోవాలని సూచించారు. అందరూ ఒకే తరహా యూనిట్ కాకుండా నాన్ట్రాన్స్పోర్ట్, వ్యవసాయ పంటల యూనిట్లు, ఇంజినీరింగ్ వర్క్స్, పౌల్ట్రీ వంటివి ఎంచుకొని వృద్ధి చెందాలన్నారు. మంథని, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క చూపించిన వాళ్లకు ఇస్తూ పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తున్నామని.. యూనిట్ల పంపిణీకి వాళ్లు ఎందుకు రాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో అద్భుతంగా అమలవుతున్న దళితబంధుపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభారఘుపతిరావు, మున్సిపల్ చైర్ ర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, జిల్లాలోని అన్ని పీఏసీఎస్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అన్ని మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మూడు నియోజకవర్గాలకు 90 మంజూరు
భూపాలపల్లి నియోజకవర్గంలో దళిత బంధు పథకంలో 90 యూనిట్లు మంజూరవగా 49 యూనిట్లు లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో ట్రాక్టర్లు 37, కార్లు 12, బొలెరో వాహనం ఒకటి ఉంది. మంథని నియోజకవర్గంలో 60 యూనిట్లు మంజూరు కాగా 30 యూనిట్లు పంపిణీ చేయగా అందులో 30 ట్రాక్టర్లు ఉన్నాయి. ములుగు నియోజకవర్గంలో ఒక యూనిట్ మంజూరుకాగా లబ్ధిదారుడికి ట్రాక్టర్ అందజేశారు. మరో 71 యూనిట్లు రెండో విడుతలో అందజేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
డ్రైవర్.. ఓనరైండు..
ఈయనది భూపాలపల్లిలోని ఫకీర్గడ్డ. పేరు దుర్గం పృథ్వీ. దళితబంధు పథకం కింద ట్రాలీ వచ్చింది. ఇంతకుముందు టాటాఏస్ డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ట్రాలీ కొనుక్కోవాలనే కోరిక ఉన్నా.. డబ్బుల్లేక అది కలగానే మిగిలిపోయింది. ఇంతలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అతడి పేరు దళితబంధు జాబితాలో చేర్చాడని తెలిసి సంబురపడ్డాడు. ఇంకేముంది పృథ్వీకి ట్రాలీ వచ్చింది. డ్రైవర్ నుంచి ఓనర్ కావడంతో సంతోషం పట్టలేకపోయాడు. దళిత పేద కుటుంబాలకు అండగా నిలువడమే గాక మా జీవితాల్లో వెలుగు నింపి గొప్ప మేలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పాడు. సర్కారు ఇచ్చిన ట్రాలీతో కుటుంబాన్ని మంచిగ పోషించుకుంటూ ఆర్థికంగా స్థిరపడుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ట్యాక్సీ నడుపుకుంట దర్జాగా బతుకుత..
నేను ఇంతకమందు రోజు రూ.400 సెంట్రింగ్, హమాలీ వంటి కూలీ పని చేసుకొని కుటుంబాన్ని సాదుకునేది. పనిదొరికినప్పుడల్లా కడుపునిండా తినేది.. లేకుంటే పస్తులుండేది. నాకు దళితబంధు స్కీం ద్వారా సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు ఇచ్చిండు. సీఎం కేసీఆర్ అంటే నాకెంతో అభిమానం. దళితబంధు పైసలతోటి కారు తీసుకున్నా. నా కొడుకుకు కారు డ్రైవింగ్ వచ్చు. కారును ట్యాక్సీగా పెట్టుకొని నడుపుకుంటూ దర్జాగా బతుకుతా. నిరుపేదనైనా నాకు బతుకుదెరువు చూపిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– మంగళపెల్లి సాంబయ్య, మొగుళ్లపల్లి
విప్లవాత్మక నిర్ణయం
దళితబంధు పథకం ఓ విప్లవాత్మక నిర్ణయం. నిన్నటివరకు డ్రైవర్లుగా పనిచేసినోళ్లు ఇవ్వాళ ఓ ట్రాక్టర్కు, కారుకు, పరిశ్రమలకు ఓనర్లు అయినందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నాకెంతో గర్వంగా ఉంది. టీఆర్ఎస్ పాలనలో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. దళితబిడ్డలు విదేశీ విద్యను అభ్యసించడానికి స్కాలర్షిప్లు పెట్టి ఉన్న విద్యావంతులను చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. దళితబంధుతో సీఎం కేసీఆర్ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తాడని ఓర్వలేని బీజేపీ కేంద్రం నుంచి వచ్చే ఒక్క పైసా కూడా రాష్ర్టానికి ఇవ్వడం లేదు. తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కుతున్నా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ దళితబంధును అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి.
– భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
అన్నింటా రాణించాలి
దళితులు దళితబంధు పథకం ద్వారా వచ్చిన యూనిట్లతో ఆర్థికాభివృద్ధి సాధించాలి. యూనిట్లు అందుకున్న వారి జీవితాలు ఈ రోజు నుంచి మారిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దళితులు అన్నింటా రాణించాలి.
– కలెక్టర్ భవేశ్మిశ్రా
సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెబుతున్నా
మా దళితబిడ్డలను ఆదుకుంటున్నందుకు ఒక దళితబిడ్డగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా దళితులను పట్టించుకోలేదు. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల పాలనలో దళితులు అన్ని రంగాల్లో అణగదొక్కబడ్డారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో దళితులను పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్.
– జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
నా భూమి దున్నుకుంటనే.. కిరాయి పోత
నాకు మా ఊళ్లో రెండెకరాల భూమి ఉంది. నీళ్లు వచ్చినప్పుడు పండుతది, లేకుంటే బీడు వెట్టుడే. భూమి దున్నుకోవాలంటే డబ్బులకు మస్తు తిప్పలయ్యేది. దళితబంధు కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షలతో ట్రాక్టర్ కొనుక్కున్న. దీంతో నాకున్న రెండెకరాల భూమిని దున్నుకుంటా. తర్వాత మా గ్రామంలోని మిగతా రైతులు భూమిని దున్నడానికి కిరాయి పోత. వ్యవసాయ పనులు పూర్తికాగానే ట్రాక్టర్కు ట్రాలీ పెట్టుకొని ఇతర పనులు చేసుకుంట. పంట పండకపోతే కూలి పనులకు పోయేటోళ్లం. ఇప్పుడు సొంతూళ్లోనే చేతినిండా పని దొరుకుతది. సాయం చేసిన సర్కారు మేలు మరువం.
– పొన్నాల అయిలయ్య, నేరేడుపల్లి, భూపాలపల్లి మండలం