పటాన్చెరు టౌన్, జూలై 24 : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తున్న వారిపై బీజేపీ ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. తమ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా శుక్రవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరసనకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు 300 కార్లు, ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా వెళ్లారు.
జీఎంఆర్ కన్వెన్షన్ వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరేంద్రమోదీ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో 158 పరీక్షా ప్రశ్నా పత్రాలు లీక్తో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరులో పారదర్శకత కరువైందని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు ఆదర్శ్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, కార్యకర్తలు, బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.