దేవరుప్పుల, మే 27: మండలంలోని నీర్మాల గ్రామంలో అప్పుడే పత్తి విత్తనాలు నాటడం ప్రారంభమైంది. రోహిణి కార్తె ప్రారంభంలో పొడి దుక్కిలోనే విత్తనాలు నాటుతున్నారు. రైతులు ఇప్పటికే దుక్కి దున్ని అచ్చుతోలి పెట్టుకోగా శుక్రవారం నుంచి హైబ్రిడ్ బీటీ-2 పత్తి విత్తనాలు కూలీలతో పెట్టిస్తున్నారు. ఈ ఒక్కరోజే 50 ఎకరాల్లో పెట్టగా, మూడు రోజుల్లో రైతులు వంద ఎకరాల్లో విత్తనాలు నాటనున్నారు.
ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తాయని, మొదటి వానకే మొలకెత్తేలా ఇప్పుడు పత్తి గింజలు నాటుతున్నామని వారు అంటున్నారు. రోహిణి కార్తెలో పెట్టిన మొక్క మొలిచిన తర్వాత బలంగా ఉంటుందని, కాత ముందే వస్తుందని, పత్తికి రేటు ఉంటుందని రైతులు చెబుతున్నారు. నీర్మాలతోపాటు మండలంలోని కడవెండి, అప్పిరెడ్డిపల్లి, దేవరుప్పుల రైతులు ఏటా పొడి దుక్కుల్లో పత్తిగింజలను విత్తుతుంటారు. మొదలు పెట్టిన పంట దిగుబడులు ఎక్కువ వస్తుండడంతోపాటు ధరలు అధికంగా ఉంటుండడంతో రైతులందరూ ఈ విధానానికే ఆసక్తి చూపుతున్నారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే గులాబీ రంగు పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీని ఉధృతిని తట్టుకునేందుకే మే నెలలో పత్తి గింజలు పెడుతున్నాం. ఈ పురుగు నివారణకు మందు లేకపోవడంతో కాయల్లో ఈ పురుగు చొరబడి పత్తి కాయకుండా చేస్తుంది. దిగుబడి సగం తగ్గుతుంది. సెప్టెంబర్ వరకే అధిక పత్తిని పండించడానికే పొడి దుక్కుల్లో పత్తి గింజలు నాటుతున్నాం.
సెప్టెంబర్ వరకు చెట్టుకు 60 కాయలు ఉంటాయి. మొదట్లో పండిన పత్తికి రేటు అధికంగానే ఉంటుంది. వాతావరణ శాఖ రుతుపవనాలు ముందే వస్తున్నాయని తెలుపుతున్నారు. నేను 5 ఎకరాల్లో శుక్రవారం గింజలు పెట్టాను. మొదటి వర్షం గట్టిగ పడితే వంద శాతం మొలుస్తాయి. ఏటా ఈ పద్ధతే అవలంబిస్తున్నాం. గత ఏడాది జూన్ 5న పత్తిగింజలు పెట్టి సక్సెస్ అయ్యాను. ఈసారి ఇంకా ముందే పెడుతున్నాను. నాతోపాటు పది మంది రైతులు విత్తనాలు పెడుతున్నారు.
– సంజీవరెడ్డి, పత్తి రైతు, నీర్మాల