కూరగాయలు, బంతిపూల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. సమయానుకూలంగా పంటలు వేస్తూ లాభాలు గడిస్తున్నారు. అటు మార్కెట్లో డిమాండ్ను కూడా అంచనా వేస్తూ ఎండాకాలంలో కూరగాయలు, వానకాలంలో బంతిపూల పంటలు పండిస్తూ నిశ్చింతగా ముందుకు ‘సాగు’తున్నారు తండా రైతులు అజ్మీరా శ్రీను, లకావత్ బిచ్చు. ఇలా ఒక ఎకరంలోనే పంట వేసి లక్ష దాకా ఆర్జిస్తున్నారు.
– నర్సింహులపేట, మే 26
నర్సింహులపేట మండలం గోపతండాకు చెందిన అజ్మీరా శ్రీను, రూప్లాతండా గ్రామ పంచాయతీలోని బీల్యాతండాకు చెందిన లకావత్ బిచ్చు ఏడాదిలో మూడు పంటలు సాగు చేస్తున్నారు. ఏ కాలంలోనైనా పండే పంటలను గుర్తించి వాటిని సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు, ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో..
తక్కువ పెట్టుబడితో బెండ సాగుచేసి ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ఒక ఎకరం బెండ సాగు చేయాలంటే దున్నకానికి రూ.5 వేలు, విత్తనాలకు 5వేలు, కూలీలకు రూ.12 వేలు, ఎరువులకు, పురుగుమందులకు రూ.8 వేలు దాదాపు రూ.30 వేల వరకు ఖర్చు అవుతోంది. విత్తిన 55 రోజులకు దిగుబడి మొదలై 130 రోజుల వరకు వస్తూనే ఉంటుంది. మార్కెట్లో ధరను బట్టి ఎకరానికి సుమారు అన్ని ఖర్చులు పోను రూ.60వేల వరకు మిగులుతుందని రైతులు చెబుతున్నారు.
ఏడాదికి మూడు పంటలు వేస్తున్నం
ఎకరంలో రెండు పంటలు బంతి, మూడవ పంటగా బెండ సాగు చేస్తున్నా. మొదటి పంట వేసినప్పుడు వానకాలం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఆశించిన దిగుబడి రాలేదు. రెండవ పంటగా బంతి వేశాను. అన్ని ఖర్చులు పోను రూ.80వేలు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత బెండకాయ పెట్టాను. మార్కెట్లో ప్రస్తుతం ధర తక్కువగా ఉంది. అయినా ఎకరం పంటతో రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందనుకుంటున్నా.
– అజ్మీరా శ్రీను, గోపతండా
రూ.70వేలు మిగిలినయ్..
వానకాలంలో మిర్చి సాగు చేస్తే తామర పురుగు పట్టి దిగుబడి తగ్గింది. అప్పుడు మిర్చి పంటను తీసివేసి మక్కజొన్న పెట్టిన. రెండు ఎకరాల్లో అన్ని ఖర్చులు పోను రూ.70 వేలు మిగిలినయ్. ఇప్పుడు అర ఎకరంలో బెండ, గోరు చిక్కుడు, దోసకాయ వేసిన. బెండకాయ కోతకు వచ్చింది. మిగిలిన కూరగాయలు ఇంకో 10 రోజుల్లో కోతకు వస్తయ్. ఇప్పుడు టమాట సాగు కోసం నారు పోసిన.
– లకావత్ బిచ్చు, బీల్యాతండా