మట్టెవాడ, మే 22 : వచ్చే విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ మట్టెవాడలోని ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.19,79,933తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన చేస్తున్న నేపథ్యంలో కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అలాగే అభివృద్ధి పనులు చకాచకా పూర్తి అవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం ఉన్నారు. తమ పరిధిలోని పాఠశాలల అభ్యున్నతి కోసం పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు, దాతలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు తగిన నిధులు కేటాయించినట్లు తెలిపారు. తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా సీడీపీ నిధుల కింద రూ.49,50,000 మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీస్ జీఎం జీ నర్సింహామూర్తి పాఠశాల అభివృద్ధి కోసం రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డీ వాసంతి, డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్మసూద్, కార్పొరేటర్ ఆకుతోట రామ తేజస్వీశిరీష్, పలువురు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్ఎస్కే సేవా సమాజ్లో మిత్ర మండలి సమావేశం..
వరంగల్ మట్టెవాడలోని ఎస్ఎస్కే సేవా సమాజ్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఖత్రి మిత్ర మండలి సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు ఆకుతోట రామ తేజస్వీ శిరీష్, దిడ్డి కుమారస్వామి, పలువురు నాయకులు పాల్గొన్నారు.