వరంగల్ చౌరస్తా, మే 22: ఉమ్మడి అంధ్రప్రదేశ్లో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బతుకుజీవుడా అంటూ రోజులు వెళ్లదీసిన ప్రాంతం.. నేడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. వరంగల్ బస్టాండ్, రైల్వేస్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో చివరి ప్రాంతంగా ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ మహా నగరంగా అవతరించడంతో చివరి ప్రాంతంగా ఉన్న డివిజన్ కాస్త నగరం నడిబొడ్డున మారిపోయింది. కాలినడక సైతం కష్టంగా ఉంటే రోడ్లు విశాలంగా మారాయి. చిత్తడి కాల్వలు కాస్త కాంక్రిట్ కాల్వలుగా మారాయి. చీకటిపడితే కన్ను గిచ్చుకున్నా కనిపించని రోడ్లకు ఇరువైపులా విద్యుత్ దీపాలు వెలిశాయి, కనుచూపు మేరలో కనిపించని అభివృద్ధి ఇప్పుడు కళ్లముందే కదలాడుతుంటే చింతల్ వాసుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.
తాగునీటి సమస్యకు చెక్..
తాగునీటి సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ నల్లా కలెక్షన్ ఇచ్చారు. ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో చింతల్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుంది. శివనగర్ మీదుగా ఇన్నర్ రింగ్రోడ్డుకు చేరుకోవడానికి చింతల్ ప్రధాన రహదారిని కోట్ల రూపాయల వ్యయంతో విశాలంగా బీటీరోడ్డు నిర్మించారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా సుమారు రూ. 2.50 కోట్ల వ్యయంతో డివిజన్ పరిధిలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని లెజెండ్ స్కూల్ రోడ్డు, సాయినగర్కాలనీ, చంద్రవదన కాలనీలో రోడ్డు నిర్మాణం, ఆర్ఎస్నగర్లో వెయ్యి మీటర్ల పొడవుతో సైడ్ కాల్వలు, సీసీరోడ్డు నిర్మాణ పనులు, సుమారు రూ. 1.80 కోట్లతో శివనగర్ శ్మశాన వాటిక పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. వాటితోపాటు సుమారు కోటి రూపాయల వ్యయంతో మరిన్ని అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రూ. 7 కోట్లతో అభివృద్ధి పనులు
డివిజన్ పరిధిలో ఇప్పటివరకు సుమారు రూ. 7 కోట్లతో ప్రధాన రహదారి అభివృద్ధి, ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్, శ్మశాన వాటిక అభివృద్ధి, మురుగు కాల్వలు, సీసీరోడ్లు నిర్మించాం. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలోనే నిధులు మంజూరు చేయించి, పనులు చేపడుతాం.
– రిజ్వానా షమీమ్, డిప్యూటీ మేయర్
చింతల్ పూర్తిగా మారిపోయింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చింతల్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. ప్రతి కాలనీలో రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. గతంలో సరైన రోడ్డుమార్గం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మెయిన్ జంక్షన్ నుంచి స్తంభంపల్లి వరకు రోడ్డు వేయడంతో ప్రయాణం సులభంగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కలెక్షన్ ఇచ్చారు. దీంతో ఎండాకాలంలోనూ ఎలాంటి తాగునీటి సమస్య లేదు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి.
– అంబటి రవి, స్థానికుడు