రాజదర్బారును తలపించే భవనం.. ఇంటి నిండా నౌకర్లు.. పూలతోటలు, గుర్రపు బగ్గీలతో నాడు కళకళలాడిన ఆ కోట నేడు కాలగర్భంలో కలిసిపోతోంది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి ఆలయం అంతగా ప్రాచుర్యంలోకి రాకమునుపే అక్కడున్న ఈ భవనం నిత్యం కళకళలాడుతూ అందరి దృష్టినీ ఆకర్షించేదని చెబుతారు. సూర్యమండపం, ఆరాధ్యులతోట పేర్లతో పిలిచే తన ఇంట్లోనే కొడిమ్యాల రాజలింగారాధ్యులు శివైక్యం పొందారని.. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల వరకూ అతడి కుటుంబసభ్యులు అందులోనే జీవించారంటారు. అయితే కాలక్రమంలో కట్టడం శిథిలావస్థకు చేరడం, శివలింగాన్ని దొంగలు ఎత్తుకెళ్లడం, గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపడంతో ఆనవాళ్లు కోల్పోతుండగా, చారిత్రక భవనాన్ని పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
– భీమదేవరపల్లి, మే 21
రాజభవనంలా వెలుగొందిన చారిత్రక కట్టడం నేడు శిథిలావస్థకు చేరింది. వైశ్యులకు గురువులు ఆరాధ్యులు. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం పక్కనే ఈ ఇల్లు ఉండడం వల్ల స్వామివారిని దర్శించుకున్న వైశ్యులు కొడిమ్యాల రాజలింగారాధ్యులను కలిసేందుకు ఇంటికి వెళ్లి ఆరాధించేవారు. తదనంతరం రాజలింగారాధ్యులు తనకు 90ఏళ్లు రాగానే ఇంట్లోనే శివైక్యం పొందారని చెబుతారు. కొంతకాలం క్రితం వరకు సమాధి వద్ద అతని ఫొటో ఉండేది. అనునిత్యం వీరభద్రస్వామిని ఆరాధించేవారని.. స్వామివారు ఆజ్ఞాపించడం వల్లే శివైక్యం పొందారని అంటారు. కాగా శివైక్యం పొందిన ఆ ఇంట్లోనే దశాబ్దాల కాలం పాటు అతడి కుటుంబసభ్యులు జీవించినట్లు చెబుతారు. అయితే అక్కడ సజీవసమాధి ఉందని తెలుసుకొని ఆలయానికి వచ్చిన భక్తులు ఎంతో ఆసక్తితో భవనం వద్దకు వెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్లగానే కూలిన గోడలు, ఇంటి ప్రాంగణమంతా గడ్డి, ముళ్లపొదలు, కంచె ఉండడం చూసి లోపలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. భవనం వెనుకభాగాన నందీశ్వరుల విగ్రహాలు ఉండగా, ఇంట్లో నడిమధ్యన కొడిమ్యాల రాజలింగారాధ్యుల సమాధి ఉంది. ఇల్లు నిర్మించేటప్పుడే రాజలింగారాధ్యులు తన సమాధి కట్టుకున్నారని చెబుతారు.
ఇదీ కుటుంబనేపథ్యం..
రాజలింగారాధ్యులకు ఇద్దరు సంతానం. ఒకరు బసవయ్య, మరొకరు సోమయ్య. వీరిద్దరు మృతిచెందారు. బసవయ్యకు ఒక కుమారుడు రాజశేఖర్ ఉన్నాడు. సోమయ్యకు ఇద్దరు కుమారులు రవి, కిరణ్. రాజశేఖర్ వరంగల్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడని, సోమయ్య కుమారులు రవి, కిరణ్లు మాత్రం ఇతరత్రా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా సూర్యమండపం..
రాజలింగారాధ్యుల ఇంటిని సూర్యమండపం, ఆరాధ్యుల తోట అని కూడా పిలుస్తారు. ఇంటి పైభాగాన నలుమూలలా శివలింగం ఆకృతి ఉంది. ఇంటిలోనుంచి పైభాగానికి వెళ్లేందుకు దారి ఉంది. ఇంటికి ఒక భాగాన నంది విగ్రహాలు ఉన్నాయి. ఇవి చాళుక్యుల శైలిని పోలి ఉన్నాయని చరిత్రకారులు అంటారు. పూజా మందిరం ఉండడం వల్ల నందీశ్వరులు ఇంటి వైపు చూస్తున్నారని చెబుతారు.
శివలింగాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం..
ఆరాధ్యుల ఇంటిలో ఉన్న శివలింగాన్ని అపహరిం చేందుకు గతంలో అతని దూరపు బంధువులు యత్నించారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అప్పటి వీఆర్వో స్పార్టకస్ అడ్డుకొని మందలించారు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం శివలింగం చోరీకి గురైనట్లు తెలుస్తోంది.
స్వామివారికి భూదానం..
మూడేళ్ల క్రితం వీరభద్రస్వామి ఆలయానికి సోమయ్య కుమారులు రవి, కిరణ్లు కుటుంబసమేతంగా వచ్చి తమ భూమి రెండెకరాలు దానం చేశారు. కాగా బసవయ్య కుమారుడు రాజశేఖర్ అచూకీ మాత్రం తెలియదని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.
స్వామివారిపై భక్తితోనే..
వీరభద్రస్వామిపై భక్తితోనే ఆరాధ్యులతోటకు చెందిన రెండెకరాల భూమిని ఆలయానికి గతంలో భూదానం చేశారు. భూదానం చేసిన కిరణ్ ఇటీవలే ఆలయ ధర్మకర్తగా వ్యవహరించారు. చారిత్రక కట్టడాన్ని తలపిస్తున్న ఆరాధ్యుల ఇంటిని కాపాడేందుకు మూకుమ్మడిగా ప్రయత్నం చేస్తాం.
– ఎల్తూరి ప్రభాకర్, కొత్తకొండ ఆలయ మాజీ ధర్మకర్త