గిర్మాజీపేట, మే 13: జిల్లాలో సోమవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఈ మేరకు జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. 56 మంది సీఎస్లు, 56 మంది డీవోలు, 600 మంది ఇన్విజిలేటర్లకు విధుల కేటాయించారు. 5,072 మంది బాలురు, 4,868 మంది బాలికలు కలిపి మొత్తం 9,940 మంది విద్యార్థులతోపాటు 13 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈవో వాసంతి వెల్లడించారు.
విద్యార్థులకు డీఈవో సూచనలు
విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందుగా వెళ్లి తెలుసుకోవడం మంచిది. పరీక్ష రోజుల్లో ఉదయం 8.45 గంటల్లోగా కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులను 9.45 గంటల తర్వాత హాలులోకి అనుమతించరు. విద్యార్థులు తమతో రైటింగ్ ప్యాడ్, సరిపడా పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తెచ్చుకోవాలి. ఇన్విజిలేటర్లు తమకు మెయిన్ ఆన్సర్ బుక్లెట్కు జతపరిచి ఇచ్చిన ఓఎంఆర్ షీట్ తమదేనా? కాదా ? అని ధ్రువీకరించుకొని పరీక్ష రాయడం ప్రారంభించాలి. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లొదు. హాల్ టికెట్ తప్ప వేరే ఎలాంటి పేపర్లు వెంట తీసుకెళ్లొద్దు. ఎట్టి పరిస్థితిలోనూ ఆన్సర్ షీట్లను పరీక్షకేంద్రం బయటకు తీసుకుపోకూడదు. విద్యార్థులకు పరీక్షలపై ఏమైనా సందేహాలుంటే 9391285617 కంట్రోల్ రూం నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని డీఈవో సూచించారు.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
చెన్నారావుపేట: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెంకట్రాంనర్సయ్య తెలిపారు. చెన్నారావుపేటలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెంటర్లో ఏఎన్ఎంను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి శానిటైజ్ చేస్తామన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలన్నారు. ఆయ న వెంట డిపార్ట్మెంటల్ అధికారి కిశోర్ ఉన్నారు.