నమస్తే నెట్వర్క్, జూలై 24 : తమ అభిమాన నాయకుడు, డైనమిక్ లీడర్ కేటీఆర్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆకాంక్షించారు. అసాధ్యుడు, అనితరసాధ్యుడు అయిన యువ నేత కేటీఆర్ పదికాలాల పాటు ప్రజాక్షేత్రంలో ఉండాలని, వారి తండ్రి వలే అసమాన్య నాయకత్వ పటిమతో మరెంతోమంది ఆదరాభిమానాలు పొందాలని, వారి అభిమానానికి దాసుడు కావాలని అభిలషించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, యువ నేత కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉండడం; తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఢిల్లీలో విద్యార్థులు, యువకులు కేంద్రంపై వీరోచితంగా పోరాడుతుండడం, అదే సమయంలో ఢిల్లీ పోలీసుల చేతిలో లాఠీదెబ్బలకు గాయపడుతుండడం వంటి కారణాల నేపథ్యంలో ఈసారి తన బర్త్డే వేడుకులకు దూరంగా ఉండాలని, వారికి సంఘీభావం తెలపాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు.
అందుకని తన బర్త్డే వేడుకల కోసం అనవసర ఖర్చులు పెట్టొద్దని, వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు, అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో కేకులు కట్ చేసినప్పటికీ.. చాలా చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, ఆశ్రమాల్లో అభాగ్యులకు పండ్లు, పాలు, రొట్టెలు వంటివి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు చోట్ల జరిగిన కేటీఆర్ బర్త్డే వేడుకల్లో పార్టీ నేతలు మాట్లాడుతూ.. రాజకీయాలను, అధికార బలాలను ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించేందుకూ వినియోగిస్తున్న ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమేనని అన్నారు.

అందుకే తెలంగాణ యూత్ ఐకాన్గా యువనేత నిలిచారని గుర్తుచేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలోనూ, స్వరాష్ట్రం సిద్ధించాక ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టడంలోనూ, పట్టణాభివృద్ధిలో రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలపడంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ దార్శనికత అమూల్యమైనదని ప్రశంసించారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖ నేతలు, మాజీ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నగర నేతలు, సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేశారు.
యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. ఇక, మధిరలో ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, అశ్వారావుపేట, కొత్తగూడెంలలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో ఉద్యమనేత దిండిగాల రాజేందర్, ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నివాసంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఇతర నేతలు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, అభిమానులు కలిసి ‘జై తెలంగాణ.. జై కేటీఆర్.. జై బీఆర్ఎస్.. లాంగ్ లివ్ కేటీఆర్ అన్నా..’ అంటూ అభిమానంతో చేసిన నినాదాలు మిన్నంటాయి.