వర్ధన్నపేట, మే 21: గ్రామాల్లోని కుల సంఘాల ప్రగతికి చేయూతనందిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు శనివారం ఎమ్మెల్యేను హనుమకొండ ప్రశాంతినగర్లోని ఆయన స్వగృహంలో కలిసి పలు సమస్యలు వివరించారు. నియోజకవర్గంలోని కుల సంఘాల ప్రతినిధులు వారి సమస్యలను విన్నవించారు. స్పందించిన అరూరి ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుల దేవతలకు ఆలయాల నిర్మాణం, కమ్మునిటీ భవనాల ఏర్పాటు, ఇతర సమస్యల తక్షణ పరిష్కారానికి తనవంత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఇల్లందలో గౌడ సంఘం కమ్యునిటీ భవనం శిథిలావస్థకు చేరుకుందని, దాని స్థానంలో మినీ ఫంక్షన్హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. త్వరలోనే ఫంక్షన్హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేయమని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్నదని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షుడు సమ్మెట లక్ష్మీనారాయణ, సట్ల సమ్మయ్య, కవిరాజు పాల్గొన్నారు.