వరంగల్, మే 21: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ విద్యుత్నగర్, కనుకదుర్గా కాలనీ, న్యూ శాయంపేట, రాంనగర్లో శనివారం ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పట్టణ ప్రకృతి వనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే గ్రేటర్లోని 34 డివిజన్లలో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. మిగితా 32 డివిజన్లలో పార్కుల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 31వ డివిజన్లో రెండు పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు మేయర్, కమిషనర్ స్థల పరిశీలన చేశారు. పట్టణ ప్రకృతి వనాల్లో ఆట వస్తువులతోపాటు గ్రీనరీ, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సీహెచ్వో కిశోర్, హెచ్వో ప్రిసిల్లా, ఏసీపీ సుష్మ పాల్గొన్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
నగరంలోని ప్రధాన నాలాల్లో పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 34 ప్రధాన నాలాలు, వరదనీరు కాల్వల్లో వర్షాకాలంలోగా పూడికతీత పనులు పూర్తి చేయాలన్నారు. రూ. 95 లక్షలతో చేపట్టిన పనులపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నయీంనగర్ నుంచి వడ్డేపల్లి, సాకరాశికుంట నుంచి కరీమాబాద్, భద్రకాళీ నాలా పరిసర ప్రాంతాలు శివనగర్, బొందివాగు, 12 మోరీలు, వడ్డేపల్లి పరిధిలోని జవహర్కాలనీ, కేయూసీ, పరిమళకాలనీ, పోచమ్మకుంట, ప్రసిడెన్సీ స్కూల్, కొత్తూ రు నాలాల పూడికతీత పనులు వేగంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో ఈఈలు బీఎల్ శ్రీనివాసరావు, శ్రీనివాస్, డీఈలు రవికిరణ్, రవికుమార్, ఏఈలు కృష్ణమూర్తి, కార్తీక్రెడ్డి పాల్గొన్నారు.
చేతన ఫౌండేషన్ సేవలు అభినందనీయం
గిర్మాజీపేట: చేతన ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మేయర్ సుధారాణి అన్నారు. వరంగల్ 33వ డివిజన్ అండర్రైల్వేగేట్ ప్రాంతంలో చేతన ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ అంకురా ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, రోటరీ క్లబ్ ఆఫ్ అంకురా జిల్లా ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాస్, సెక్రటరీ మహ్మద్ రఫీ, తోట వైద్యనాథ్, సుధాకర్రెడ్డి, చేతన ఫౌండేషన్ సభ్యులు సురేశ్, రవి, నరేశ్, రషీద్ పాల్గొన్నారు.