పల్లెలు ప్రగతి ముల్లెలుగా మారాయి.. గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది.. రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు కనుచూపుమేర కనిపించడంలేదు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతితో సాధ్యమవుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 241 గ్రామ పంచాయతీల్లో శిథిల భవనాలు, అధ్వాన రోడ్లు, తుప్పుపట్టిన కరంట్ పోల్స్, అస్తవ్యస్త డ్రైనేజీ, పిచ్చిమొక్కల సమస్య తీరడమే గాక వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, ప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చి పల్లెలకు కొత్త శోభను తెచ్చింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నివారణతో పాటు పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ, ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గుర్తింపుపై దృష్టి సారిస్తున్నదిరు.
జయశంకర్ భూపాలపల్లి, మే 19 (నమస్తే తెలంగాణ) : పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సర్కార్ ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తుండగా పల్లె ప్రగతి ద్వారా నాలుగు విడుతల్లో నిర్వహించిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, రోడ్డు మీదుగా పారే మురుగునీరు, చెత్తాచెదారంతో నిండే రోడ్లు, మోరీలు నేడు పరిశుభ్రంగా మారాయి. ప్రతీ ఊరు నేడు పచ్చని చెట్లు, కళకళలాడే రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలతో అద్దంలా మెరుస్తున్నాయి. 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొదట విడుత ప్రారంభమైన పల్లెప్రగతి కార్యక్రమాలు దిగ్విజయంగా నాలుగు విడతలు పూర్తి చేసుకున్నాయి. గతంలో సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్న పల్లెలు నేడు సమస్య రహిత గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి. పల్లెప్రగతిలో గుర్తించిన సమస్యలు వెనువెంటే పరిష్కరించడంతో గ్రామాలు సరికొత్తగా కనిపిస్తున్నాయి.
పల్లె ప్రగతి గ్రామాల ముఖచిత్రాన్ని మార్చివేసింది. ప్రతీ జీపీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ వచ్చింది. వీటికి తోడు 10 శాతం నిధులు పచ్చదనం కోసం కేటాయించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, మొక్కలు పెంచేందుకు నర్సరీలు, చెత్తను వేరు చేయడంతో పాటు వీధులన్నీ పరిశుభ్రంగా ఉండేందుకు సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది ప్రభుత్వం. ప్రతీ ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసింది. అంతేకాకుండా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో శ్రమదానాలు చేపట్టింది. దానికితోడు గ్రామాల్లో శిథిలమై, పాడుపడిన ఇండ్లు, గోడలను జేసీబీలతో కూల్చి వేయించింది. సర్కార్ తుమ్మలు. పెంటకుప్పలు గ్రామంలో కన్పించకుండా తొలగించింది. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని కాలనీలు, ప్రధాన రహదారుల వెంట లూజ్లైన్లు(విద్యుత్ తీగలు) సరి చేయించారు. అంతేకాకుండా ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి వేశారు. ఎల్ఈడీ బల్బులు సైతం అమర్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేశారు. గ్రామంలో ఖాళీ స్థలాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను డోజర్లతో క్లీన్ చేయించింది. ప్రభుత్వం, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి వారం రోజుల పాటు కార్యక్రమాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగారు. ట్రాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను తడి, పొడిగా వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్ వద్ద ఏర్పాటుచేసిన సేంద్రియ ఎరువులు సైతం తయారు చేయించారు.
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో రూ.12.50 లక్షల చొప్పున 241 వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఒక్కో సెగ్రిగేషన్ షెడ్డు కోసం రూ.2.49 లక్షలను ఖర్చు చేశారు. ఇందులో తడి పొడి చెత్తలను వేర్వరుగా సేకరిస్తూ కంపోస్ట్ ఎరువును తయారు చేయడానికి వినియోగిస్తున్నారు.
జిల్లాలోని 241 జీపీల పరిధిలో 391 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 11 మండలాల పరిధిలో ప్రతి మండలానికి 5 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 55 వనాలకు 14 వనాలు పూర్తికాగా 36 వనాల పనులు పురోగతిలో ఉన్నాయి. ఐదింటికి స్థల పరిశీలన పూర్తి చేసి, చదును చేసే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాలో పల్లె ప్రగతి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రతి రోజూ పారిశుధ్య పనులు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్ల సాయంతో ఇంటింటి చెత్త సేకరిస్తున్నారు. దీంతో పట్టణ, గ్రామాల్లో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్లు వైద్యశాఖ అధికారులు తమ నివేదికల ద్వారా వెల్లడించారు.