జయశంకర్ భూపాలపల్లి, మే 19( నమస్తేతెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ నాయకులు డబుల్ ఇంజిన్ జపం చేస్తున్నారని, ఆ ప్రభుత్వాలు మనకొద్దని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గణపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు.
బీజేపీ నాయకులు తమకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అందిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని మాయమాటలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్లీజ్ ఒక్క సారి అవకాశం పేరుతో ప్రజలను మోసగించేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారో గమనించాలని అన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని ప్రజలను కోరారు. అనంతరం 78 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఏడుగురికి సీఎం సహాయనిధి రూ.2.33 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో పార్టీ గణపురం మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్రెడ్డి, తహసీల్దార్ సతీశ్కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన వావిలాల రాధమ్మ మృతి చెందగా మృదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన వెంగళ రాజమ్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.