హనుమకొండ సబర్బన్, మే 15: నేను ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపేటువంటి 563 నంబర్ జాతీయ రహదారిని. నా ఒంటిపై అయిన గాయాల (గుంతలు) వల్ల నిత్యం మానసిక క్షోభను అనుభవిస్తున్నా. రోజూ నాపై నుంచి వెళ్లే ప్రయాణికులు, వాహనదారులతో బాధను పంచుకోవాలనిపించింది. అంతకు ముందు సాధారణ రాష్ట్ర రహదారిగా ఉన్న నన్ను అప్పటి ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ గట్టిగ ప్రయత్నించి జాతీయ రహదారిగా ప్రమోషన్ ఇప్పించాడు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ర్టాలకు చెందిన వాహనాలు ప్రతి రోజు వేలాదిగా నా పైనుంచే వెళ్తుంటాయి. తీరొక్క వాహనాలు వెళ్తుంటే నాకైతే చెప్పలేని సంతోషం అనిపిస్తుంది.
నేను ఇంత మందికి సేవ చేస్తున్నాననే గర్వం కూడా కలుగుతుంది. గట్లాంటిది గిప్పుడు నాకు లేని కష్టం వచ్చిపడింది. జాతీయ రహదారి అనే సంబురమే గాని గా కేంద్ర సర్కారు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎల్కతుర్తి మండలంలో నాలుగు కిలోమీటర్ల ప్రయాణం నరక ప్రాయంగా మారింది. అడుగుకో భారీ గుంత ఏర్పడింది. దీని వల్ల వాహనాలను వరుస క్రమంలో పంపలేకపోతున్నాను. గుంతలను తప్పించుకునేందుకు వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో నిత్యం ఒకటి రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి. గాయాల పాలైన వారిని, చనిపోయిన వారిని చూస్తే ఓ వైపు జాలి, మరో వైపు బాధ కలుగుతున్నది.
పట్టించుకోవాల్సిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం ప్రజల సమస్యలను గాలికొదిలేసి పాదయాత్రలంటూ ఊర్లు తిరుగుతున్నడు. గా వినోద్కుమార్ సారు ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం నాపై చిన్న గుంత పడ్డ వెంటనే స్పందించి ఢిల్లీ అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేయించెటోడు. ఇప్పుడున్న సారుకు ఆ సోయి ఉన్నట్టు అనిపిస్తలేదు. భారీ లోడ్తో వెళ్లే వాహనాలు గుంతల్లో పడి బ్రేక్ డౌన్ అవుతున్నాయి. పాపం సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఇక్కడే రోజుల తరబడి నిలిచి పోతున్నాయి. కొందరైతే నన్ను తిడుతూ ఉతికి పారేస్తున్నారు. తప్పు నాది కాకున్నా తిట్లు మాత్రం తప్పడం లేదు. గా ఎల్కతుర్తి పోలీసోళ్లు దయ తలిచి అక్కడక్కడ కొంత సిమెంట్తో పూడ్చారు. పాపం వాళ్లు మాత్రం ఎంతని భరిస్తరు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే సారు నేషనల్ హైవే అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఢిల్లీకి ఫైల్ పంపినం.. రాంగనే పని పూర్తి చేస్తమని చెబుతున్లట. ఇది ఎమ్మెల్యే శేతుల పని కాదాయే. రాత్రి పూట అయితే పరిస్థితి మరింత దరిద్రంగ మారింది. వాహనాల లైట్లు సక్కగ రాక మస్తుమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అసలే రోడ్డు మీద గుంతలతో నాపై ప్రయాణం నరక ప్రాయంగ మారిందని ప్రయాణికులు తిట్టి పోస్తుంటే.. దీనికి తోడు ఎస్సార్ యూనివర్సిటీ మొదలుకుని హసన్పర్తి పోలీస్ స్టేషన్ వరకు అధికారులు పెద్ద ఎత్తున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీని వల్ల ప్రయాణికులు ఎగిరి పడడంతో పాటు ఒళ్లు హూనం అయిపోతుందని వాపోతున్నారు. నన్ను నిర్మించి గిన్నేండ్లయినా గింత అధ్వానమైన పరిస్థితి ఎన్నడూ రాలేదు. ఇప్పటికైన జాతీయ రహదారి అధికారులు కలుగజేసుకుని జర నా దుస్థితిపై దృష్టి పెట్టి ఈ నరకప్రాయం నుంచి విముక్తి కల్పించండని ప్రార్థన.