రాయపర్తి, మే 14: రాష్ట్రంలో ప్రజామోదం లేని ప్రతిపక్ష పార్టీలతో ఒరిగేదేమీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంతోపాటు మండలంలోని జేతురాంతండా, రాగన్నగూడెం, పెర్కవేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలోని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
70ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిని పరిపాలించిన ఈ పార్టీలు ఏనాడూ ప్రజాసంక్షేమం, సమగ్రాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. వాటి కారణంగానే ఇప్పటికీ భారతదేశం దారిద్య్రం, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కొద్దిరోజులుగా కిరికిరి మాటలు, కోతిచేష్టలతో చిల్లరరాజకీయాలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. కొందరు జాతీయ పార్టీల సీనియర్ నాయకులు పొలిటికల్ టూరిస్ట్లుగా రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ అసంబద్ధ ప్రకటనలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రజలు గమనించాలని కోరారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడంసీఎం కేసీఆర్కే సాధ్యమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల పల్లెలన్నీ సాగు జలాలతో కోనసీమను తలపిస్తున్నాయని చెప్పారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
మంత్రి ఎర్రబెల్లి మండలంలోని జేతురాంతండా గ్రామపంచాయతీ పరిధిలో రూ.25లక్షలతో సీసీ రోడ్లు, రూ.3లక్షలతో డ్రెయినేజీలు, రూ.20లక్షలతో మెటల్రోడ్లు, రూ.30లక్షలతో రాయపర్తి-రావులతండా వరకు సీఆర్ఆర్ రోడ్లు, రాయపర్తి పీడబ్ల్యూడీ రోడ్ – జేతురాంతండా వరకు రూ.18లక్షలతో బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. మండలకేంద్రంలో రూ.9కోట్ల 10లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ఆవరణలో నిర్మించిన గోడౌన్ ప్రారంభోత్సవం, మండలంలోని రాగన్నగూడెంలో రూ.20లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, రూ.3లక్షలతో మురుగుకాల్వలు, మండలంలోని పెర్కవేడులో రూ.65లక్షలతో సీసీ రోడ్లు, రూ.9లక్షలతో డ్రెయినేజీలు, రూ.15లక్షలతో మెటల్ రోడ్లు, రూ.60లక్షలతో పెర్కవేడు-మహబూబ్నగర్ వరకు సీఆర్ఆర్, బీటీ రోడ్లు, రూ.8లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభం, రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్లైట్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
అద్దె యంత్రాల కేంద్రం ప్రారంభం
రాయపర్తి మండల కేంద్రంలోని ఇందిరాక్రాంతి కార్యాలయం ఆవరణలో స్వర్ణభారతి మండల సమా ఖ్య నేతృత్వంలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న అద్దె వ్యవసాయ యంత్రాల పంపిణీ కేంద్రాన్ని మండల మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం రాయపర్తి, పెర్కవేడు గ్రామాల్లో జరిగిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని ప్రసంగించారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, అదనపు కలెక్టర్ బానోతు హరిసింగ్, జెడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, డీపీవో నాగపురి స్వరూప, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోతు కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, ఏపీఎం పులుసు అశోక్కుమార్ పాల్గొన్నారు.
పిచ్చమ్మా.. బాగున్నవా!
ఓ వృద్ధురాలితో మంత్రి ఆత్మీయ పలకరింపు ప్రజా సేవకుడిగా నిత్యం జనం మధ్య ఉంటూ క్షణకాలం తీరికలేకుండా బిజీగా గడిపే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం మండలంలో పర్యటించిన సందర్భంగా ఓ వృద్ధురాలితో ఆత్మీయంగా ముచ్చటించారు. మండల కేంద్రంలో మండే ఎండలో ఎంతో ఓపికగా ఉన్న వృద్ధురాలిని చూసి చలించిపోయారు. వాహనం ఆపి దిగి తనకు ఎంతోకాలంగా పరిచయం ఉన్న వృద్ధురాలైన ముద్రబోయిన పిచ్చమ్మను ఆత్మీయ ఆళింగనం చేసుకున్నారు. ‘పిచ్చమ్మా.. కొడుకులు, బిడ్డలు, మనుమలు, మనుమరాండ్లు ఎట్లున్నరే..’ అని అడిగారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్, పెంచిన రేషన్ బియ్యం, 24గంటల ఇరాం లేని కరెంట్, మిషన్ భగీరథ మంచినీళ్లు అందుతున్నయా అని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుమారుడు కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడిగా పనిచేస్తుండగా మంత్రి అదేమీ లెక్కచేయకుండా మాట్లాడుతుండడం చూసిన ప్రజలు హాట్సాఫ్ దయన్న అని చెప్పారు.