గీసుగొండ, మే 14: చెట్టు బెరడు కూలీల పొట్టనింపుతున్నది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చెట్ల నుంచి పొట్టు సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. కోల్కతా నుంచి వలస వచ్చిన కూలీలు వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న నీడనిచ్చే దుర్షన్ భారీ వృక్షలను ఎక్కి.. ఆ చెట్టు కొమ్మల బెరడు నుంచి పొట్టు సేకరిస్తున్నారు. చెట్టు పైభాగంలోని చిన్నిచిన్న కొమ్మలను తెంచి వాటి నుంచి బెరడును కొడవళ్లతో తీస్తున్నారు. ఆ పొట్టు నుంచి షూ పాలిష్కు అవసరమయ్యే కెమికల్ను తయారు చేస్తారని, ఫర్నిచర్కు వాడే కలప వుడ్ పాలిష్ తయారీకి ఈ పొట్టు ఉపయోగపడుతుందని కూలీలు తెలిపారు.
తాము సేకరించిన బెరడు పొట్టుకు కోల్కతాలో కిలోకు రూ. 300 ధర లభిస్తుందని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో దుర్షన్ చెట్టును సిరిస్ చెట్టు అని పిలుస్తారని చెబుతున్నారు. పొట్టును తీసుకునే కంపెనీ వారు ముందుగా తమకు నగదును అడ్వాన్స్గా చెల్లిస్తారని చెప్పారు. ఉదయాన్నే చెట్లను ఎక్కి చిన్నచిన్న కొమ్మలను తెంచుకొని కిందకు దిగుతామని, అనంతరం కొమ్మలకు ఉన్న పొట్టును కొడవళ్లతో తొలుస్తామని వివరించారు. రోజుకు ఒక కూలీ పది కిలోల పొట్టును సేకరిస్తాడని పేర్కొన్నారు. ఉపాయం ఉంటే ఎలాగైనా ఉపాధి పొందొచ్చని నిరూపిస్తున్నారు కోల్కతా కూలీలు.