రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 7న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించనున్నారు. గణేశా ఇకో పెట్, టెక్ వస్త్ర పరిశ్రమలను మంత్రి ప్రారంభించనున్నారు. కైటెక్స్ కంపెనీ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. యంగ్వన్ సంస్థకు కేటాయించిన భూమిని పరిశీలించి, సూరత్ కంపెనీకి స్థల పత్రాలు అందజేయనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సోమవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్కును సందర్శించారు. వరంగల్ ఆర్డీవో, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్రాథోడ్తో పాటు ఇతర అధికారులతో కలిసి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభానికి సిద్ధమైన గణేశా ఇకో స్పెర్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు.
వరంగల్, మే 2(నమస్తేతెలంగాణ) : గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టింది. ఈ పార్కులో వస్త్ర పరిశ్రమల స్థాపన కోసం సుమా రు 1,200 ఎకరాల భూములను సేకరించింది. 2017 అక్టోబర్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీన్ని వస్త్ర పరిశ్రమగా తీర్చిదిద్దడానికి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం టీఎస్ఐఐసీకి నిధులు కేటాయించింది. ఈ నిధులతో టీఎస్ఐఐసీ టెక్స్టైల్ పార్కులో విద్యుత్ సబ్ స్టేషన్, రహదారులు నిర్మించి సెంట్రల్లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. మిషన్భగీరథ నీటి సరఫరాకు పనులు చేపట్టింది.
సకల సౌలత్లు కల్పించే దిశగా ముం దుకు వెళ్తున్నది. పార్కులో వస్త్ర పరిశ్రమలు స్థాపించేందుకు దేశ విదేశాల నుంచి పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. వస్త్ర పరిశ్రమలు నెలకొల్పేందుకు వీటికి టీఎస్ఐఐసీ పార్కులో స్థలం కేటాయిస్తున్నది. ఇప్పటికే వివిధ కంపెనీలకు ఇక్కడ భూములను ఇచ్చింది. ఉత్తర భారత దేశం నుంచి మొదట వచ్చిన గణేశా ఇకో స్పెర్ లిమిటెడ్ కంపెనీకి వేర్వేరుగా 50 ఎకరాలను కేటాయించింది. ఈ కంపెనీకి చెందిన గణేశా ఇకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్కు 30, గణేశా ఇకో టెక్ ప్రైవేట్ లిమిటెడ్కు 20 ఎకరాల చొప్పున పక్కపక్కన ఇచ్చింది. దీంతో గణేశా ఇకో స్పెర్ కంపెనీ ఇకో పెట్లో ఫైబర్ యాన్ లైన్, ఇకో టెక్లో వాషింగ్ లైన్ తయారీ పరిశ్రమల నిర్మాణం చేపట్టింది. ఈ సంస్థ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,000 కోట్లు. ప్రస్తుతం తొలివిడుత రూ.300 కోట్లతో రెండు ప్రొడక్షన్ యూనిట్లు నిర్మించింది. ఈ పరిశ్రమలను 7వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
కైటెక్స్ నిర్మాణానికి భూమిపూజ..
కేరళ రాష్ర్టానికి చెందిన కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అపెరల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కైటెక్స్ సంస్థ చైర్మన్ సాబు జాకబ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించారు. ఇక్కడ తమ సంస్థ ద్వారా వస్త్ర పరిశ్రమను నెలకొల్పేందుకు సుముఖత వెలిబుచ్చారు. గత సెప్టెంబర్ 18న హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు అధికారులను సాబు జాకబ్ బృందం కలిసింది. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, సీతారాంపురంలో తమ రూ.వెయ్యి కోట్ల ప్రాథమిక పెట్టుబడిని రూ.2,400 కోట్లకు పెంచినట్లు సాబు జాకబ్ ప్రకటించారు. దీంతో 2,200 ఉద్యోగాలు వస్తాయని, భవిష్యత్లో ఇక్కడి నుంచి మూడు మిలియన్ల వస్ర్తాలను అమెరికాకు ఎగుమతి చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేరళలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ కైటెక్స్ అని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కిడ్స్ అపెరల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీగా ఉన్న కైటెక్స్ గ్రూపును తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ కంపెనీ వస్త్ర పరిశ్రమల స్థాపన పూర్తయిన తర్వాత సుమారు మూడు లక్షల ఎకరాల్లోని తెలంగాణ కాటన్ను కంపెనీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కైటెక్స్ కంపెనీ వస్త్ర పరిశ్రమల స్థాపన కోసం స్థలం కేటాయింపు జరిగిన దరిమిలా 7న మంత్రి కేటీఆర్ ఇక్కడ భూమిపూజ చేయనున్నారు.
సూరత్ కంపెనీకి స్థల పత్రాలు..
దక్షిణ కొరియా సంస్థ యంగ్వన్కు ప్రభుత్వం టెక్స్టైల్ పార్కులో 300 ఎకరాలు కేటాయించింది. రోడ్లు, ఇతర అవసరాలకు పోగా 262 ఎకరాలకు యంగ్వన్ సంస్థ కొద్దినెలల క్రితం ప్రభుత్వానికి డబ్బు చెల్లించింది. ఈ 262 ఎకరాల్లో రూ.900 కోట్ల పెట్టుబడితో వస్త్ర పరిశ్రమ స్థాపించేందుకు సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. ఏడో తేదీ పర్యటనలో ఈ పార్కు లో యంగ్వన్ సంస్థకు కేటాయించిన భూమిని మంత్రి కేటీఆర్ వ్యూపాయింట్ ద్వారా పరిశీలిస్తారు. సంస్థ ప్రతినిధులు ఈ స్థలంలో వస్త్ర పరిశ్రమల స్థాపన ప్రతిపాదనలను మ్యాప్ ద్వారా కేటీఆర్కు వివరిస్తారు. అలాగే, పార్కులో చిన్నతరహా వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు సూరత్ కంపెనీ ముందుకొచ్చింది. ఇక్కడ ఈ సంస్థకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. స్థలం పత్రాలను మంత్రి కేటీఆర్ సదరు కంపెనీ ప్రతినిధులకు అందజేస్తారు. ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్తో కేటీఆర్ ఇంటరాక్షన్ అవుతారు. మంత్రి పర్యటన సందర్భంగా టెక్స్టైల్ పార్కులో ప్రా రంభోత్సవం, భూమిపూజ, స్థల పత్రాల అందజేత అనంతరం బహిరంగ సభ నిర్వహణపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.