ములుగు రూరల్, మే 2 : పల్లె ప్రజలకు కూడా పట్టణాల తరహా ఆహ్లాదకర వాతావరణం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుంటే కొందరు స్థానిక పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ఆయా గ్రామాలవారికి శాపంలా పరిణమిస్తున్నది. ములుగు జిల్లా ములుగు మండలం ముద్దునూరుతండా పల్లె ప్రకృతి వనం పర్యవేక్షణ లోపానికి సాక్ష్యంగా నిలిచింది. తూతూ మంత్రంగా పనులు చేసి వదిలేయడంతో పార్కు పూర్తి అధ్వానంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పల్లె ప్రకృతి వనాన్ని అన్ని హంగులతో నిర్మించాల్సి ఉన్నా కనీసం నీళ్లు కూడా పట్టక ఇక్కడ నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వనంలో వాకింగ్ ట్రాక్లు కూడా నిర్మించలేదు. బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అది పల్లె ప్రకృతి వనం అని తెలుసుకోవడం ఇబ్బందికరంగా మారింది. పల్లె ప్రకృతి వనం చుట్టూ వేసిన ఫెన్సింగ్ సరిగా లేకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను మేస్తున్నాయి.
ఆదర్శంగా నిలవాల్సింది పోయి..
రామచంద్రాపురానికి అనుబంధంగా ఉన్న ముద్దునూరు తండాను ప్రభుత్వం జీపీగా మార్చింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అభివృద్ధిలో మరింత కుంటుపడుతున్నది. ఇప్పటికైనా అధికారులు ముద్దునూరు తండా పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది.
బోరు వేయాలని కోరాం..
పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లందించేందుకు బోరు వేయాలని అధికారులను కోరినం. గతంలో కలెక్టర్కు కూడా వినతిపత్రం ఇచ్చినం. నీళ్లు లేక మొక్కులు ఎండిపోతున్నది వాస్తవమే. ట్యాంకర్తో నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
– తిరుపతి, సర్పంచ్