రైతన్నకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. తెలంగాణ రైతుల నుంచి కేంద్రం వడ్లు కొనాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రమైన వరంగల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఓసిటీ మైదానంలో భారీ ఏర్పాట్లు చేయగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు.
వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ రైతులు పండించిన రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ అధిష్టానం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మార్చిలో తొలివిడుత ఉద్యమ కార్యాచరణ ముగిసిన తర్వాత తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రెండో విడుత ఉద్యమ కార్యాచరణ నిర్ణయించారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకో, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం, టీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలుపాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
రైతులు, పార్టీ శ్రేణులు తరలిరావాలి..
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ గురువారం వరంగల్ ఓసిటీ మైదానంలో జిల్లా స్థాయి నిరసన దీక్ష నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ దీక్షను పార్టీ జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీ సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా ఓసిటీ మైదానంలో సకల సన్నాహాలు చేసింది. నీడ కోసం షామియానాలు, భోజనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నది. ఏర్పాట్లను ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ పరిశీలించారు. డీసీసీబీ చైర్మన్ ఎం రవీందర్రావు, టీఆర్స్ ముఖ్యనేతలు ఎర్రబెల్లి ప్రదీప్రావు, బొల్లం సంపత్కుమార్, మసూద్, దిడ్డి కుమారస్వామి, తదితరులు ఎమ్మెల్యేల వెంట ఉన్నారు. పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యేలు రమేశ్, నరేందర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఓసిటీ మైదానంలో జరిగే నిరసన దీక్షకు జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
రైతు నిరసన దీక్షను విజయవంతం చేయాలి..
కాశీబుగ్గ : నగరంలోని 19వ డివిజన్ ఓ సిటీ మైదానం హనుమాను దేవాలయం వద్ద గురువారం నిర్వహించే నిరసన దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. బుధవారం ఓసిటీ మైదానాన్ని వారు పరిశీలించి మాట్లాడుతూ.. తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలను నూకలు తినాలన్న కేంద్ర మంత్రి తీరు మార్చుకోవాలన్నారు. ఇక్కడికి వచ్చే రైతులు, కార్యకర్తలకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వరి వేయాలని రైతులను ఉసిగొల్పి ఇప్పుడు పట్టించుకోవవడం లేదన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి ప్రదీప్రావు, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బొల్ల సంపత్కుమార్, డీసీసీబీబి చైర్మన్ మార్నేని రవీందర్రావు, టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ బాధ్యుడు నిమ్మగడ్డ వెంకన్న, రాజనాల శ్రీహరి, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలత-భాస్కర్, దిడ్డి కుమారస్వామి, జన్ను షీభారాణి-అనిల్, వస్కుల బాబు, గందె కల్పన-నవీన్ పాల్గొన్నారు.