కృష్ణకాలనీ, ఏప్రిల్ 6 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేశారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్హౌస్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ దళితబంధు లబ్ధిదారులకు యూ నిట్ల ఎంపికపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక్కడ మంత్రి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన రూ.10లక్షలతో ఏ యూనిట్ పెడితే బాగుంటుందో ఆలోచించి ఎంచుకోవాలని సూచించారు.
తెలంగాణలో అంగన్వాడీలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి అమూల్ ద్వారా నెలకు లక్ష లీటర్లు, కర్ణాటక నుంచి 20లక్షల లీటర్ల పాలు కొంటున్నామని, తద్వారా నెలకు కొన్ని కోట్ల రూపాయలు ఇతర రాష్ర్టాలకు వెచ్చిస్తున్నామని అదే తెలంగాణలో డెయిరీలు ఉన్నట్లయితే ఆ డబ్బంతా తెలంగాణ ప్రజలకే దక్కుతుందన్నారు. మన ప్రాంతంలో ఏ పరిశ్రమలైతే లేవో వాటిని స్థాపించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. చాలామంది ట్రాక్టర్లు కొంటానని ముందుకు వస్తున్నారని, కానీ ప్రతి ఊరిలో కనీసం 50 నుంచి 60 దాకా ట్రాక్టర్లు ఉన్నాయని, ట్రాక్టర్ల ద్వారా ఏడాదిలో 3 నుంచి 4 నెలలు మాత్రమే పని దొరకుతుందని, ప్రభుత్వ యూనిట్ కుటుంబానికి జీవిత కాలం ఉపయోగపడేలా ఉండాలని సూ చించారు.
భూపాలపల్లిలో పత్తి, వడ్లు, మిరప పంటలు బాగా పండుతాయని, వాటికి ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన విత్తనాలు తయారు చేసి బ్రాండ్ పేరు పెట్టుకొని వ్యాపారం చేస్తే బాగుంటుందని ఈ దిశగా ఆలోచించాలన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 100 ఏళ్ల క్రితం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే, సీఎం కేసీఆర్ దళితబంధు ఇచ్చి దళితులను రాజుల్లా బతికేలా చేస్తున్నారన్నారు. రూ.17,700 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారని, నియోజకవర్గానికి 1700 కుటంబాలకు దళితబంధు అందుతుందన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల అదృష్టమని, నిరంతరం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడు గండ్ర అని మంత్రి సత్యవతి కొనియాడారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభారఘుపతిరావు, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేశానికే దళితబంధు ఆదర్శం : ఎమ్మెల్యే గండ్ర
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో దళిత జనాభా ఎక్కువ ఉందని, వీరిలో 100మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం చాలా శ్రమ పడాల్సి వచ్చిందన్నారు. దళితుల దీనత్వం, పేదరికం పోయేందుకే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశ పెట్టారన్నారు. ఇలాంటి స్కీంలు మళ్లీరావని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు సమన్వయంతో యూనిట్ను ఎంపిక చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.
ప్రతిపక్షాలకు చెంపపెట్టు : – టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నా రు. దళితబంధు ప్రవేశ పెట్టినప్పు డు ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడాయని, ఇప్పుడు రాష్ట్రమంతా అమలవుతుంటే.. మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తె లియని స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ దళితబంధుతో దళితుల జీవితం మారిపోతుందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలోనూ దళితబంధు ఇవ్వడం గొప్ప విషయమని, పథకాన్ని సద్వినియోగం చేసుకొని రాణించాలని ఆకాంక్షించారు. 10ఏళ్ల తర్వాత ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాలన్నారు.