అకాల వర్షాలు, చీడపీడలతో కుదేలైన మిర్చి రైతును రికార్డు స్థాయి ధరలు ఆదుకుంటున్నాయి. తొలుత మిర్చికి తామర పురుగు ఆశించింది. పంటలో పురుగు నివారణ చర్యలు చేపడుతున్న సమయంలో పుండుపై కారం చల్లినట్లు వడగండ్ల వాన పడింది. దీంతో జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 13,250 ఎకరాలకుపైగా మిర్చి పంట విస్తీర్ణం ఉంది. ఈ క్రమంలో దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న రైతుకు దేశీ మిర్చి సిరులు కురిపిస్తున్నది. క్వింటాల్ ధర రోజుకో కొత్త శిఖరాన్ని తాకుతూ చరిత్ర సృష్టిస్తున్నది. ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశంలోనే తొలిసారి క్వింటాల్కు రూ. 55,551 పలికింది. గతంలో కంటే పెట్టుబడి డబుల్ కావడం, దిగుబడులు తగ్గిన తరుణంలో మార్కెట్లో మిర్చికి రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తున్నది.
వరంగల్, ఏప్రిల్ 5(నమస్తేతెలంగాణ) : ఈ ఏడా ది దేశీ రకం మిర్చి సాగు చేసిన రైతులు మునుపెన్నడూ లేని రీతిలో ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. పంటకు పూత దశలో తామర పురుగు ఆశించింది. జిల్లాలో ఇది సోకడం తొలిసారి. గతంలో ఎప్పుడూ ఆశించిన దాఖలాల్లేవు. దీంతో హైదరాబాద్, బెంగళూరు నుంచి ఉద్యాన శాస్త్రవేత్తలు జిల్లాను సందర్శించారు. నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో దేశీ రకం మిర్చి పంటను పరిశీలించారు. తామర పురుగు నష్ట పరుస్తున్నట్లు ధ్రువీకరించారు. మిర్చికి తామర పురుగు ఆశించడం తెలంగాణ లో ప్రథమమని ప్రకటించారు. నివారణ కోసం రైతులకు సూచనలు చేశారు. ఇదే సమయంలో వడగండ్ల వాన పడింది. దీంతో జిల్లాలోని వేలాది ఎకరాల్లో వివి ధ రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అత్యధికంగా 13,250 ఎకరాలకుపైగా మిర్చి పంట విస్తీర్ణం ఉంది. మిర్చి వడగండ్ల వానతో తుడిచిపెట్టుకుపోయిం ది. మిర్చి నేలరాలగా కొమ్మలు విరిగి వరద ప్రవాహం లో కొట్టుకపోయాయి. కేవలం మోడులు మాత్రమే మిగిలాయి. వడగండ్లు పడని కొన్ని ప్రాంతాల్లోని మిర్చి పంట వర్షంతో దెబ్బతిన్నది. అప్పటికే తామర పురుగు ఆశించిన ఈ పంటను దక్కించుకొనేందుకు రైతులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వారి పెట్టుబడి గతంలో కంటే రెట్టింపైంది. పూత రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం, చెట్లు చనిపోవడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో మిర్చి ధర రోజురోజుకూ పెరుగుతుండ డం రైతులకు కొండంత ఊరటనిస్తుంది. సోమవారం ఎనుమాముల మార్కెట్లో దేశీ రకం మిర్చి ధర క్విం టాల్కు రూ.55,551 పలికింది. దేశ చరిత్రలోనే మిర్చికి ఇంత ధర నమోదు కావడం ఫస్ట్ టైం.
కొనుగోళ్లను పరిశీలిస్తే…
ఎనుమాముల మార్కెట్లో ఈ ఏడాది మిర్చి కొనుగోళ్లను పరిశీలిస్తే పంట దిగుబడి తగ్గినట్లు స్పష్టం అవుతున్నది. ఏటా డిసెంబర్ నెల నుంచి మిర్చి ఈ మార్కెట్కు రావడం మొదలవుతుంది. 2020-21 ఆర్థిక సం వత్సరంలో డిసెంబర్ నుంచి మార్చి 31 వరకు 3,56,235 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. తేజ, వండర్హాట్, యూఎస్341, దీపిక, దేశీ, సింగిల్పట్టీ, 1048, తాలు, 334 రకం మిర్చి ఉంది. దీనికి అత్యధిక ధర క్వింటాల్ రూ.26 వేలు నమోదైంది. అప్పటివరకు మార్కెట్ చరిత్రలో అదే రికార్డ్. 2021-22 ఆర్థి క సంవత్సరంలో డిసెంబర్ నుంచి మార్చి 31 వరకు ఎనుమాముల మార్కెట్కు వచ్చిన మిర్చిని పరిశీలిస్తే గత ఏడాది కంటే తగ్గింది. నాలుగు నెలల్లో అన్ని రకా ల మిర్చి కలిపి 2,01,016 క్వింటాళ్లు మాత్రమే వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఇం దులో అధిక ధర కోసం రైతులు గత ఏడాది కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిది కూడా ఉంది. ఈ ఏడాది మిర్చిలో ప్రతి రకానికి రికార్డ్ స్థాయి ధర పలుకుతుండడం విశే షం. దేశీతో పాటు సింగిల్పట్టీ, తేజ వంటి రకాలకు గతంలో మార్కెట్ చరిత్రలో లేని ధర నమోదైంది.
దేవుడు కరుణించిండు…
– పేరాల కిషన్రావు, మిర్చి రైతు, గోవిందపురం, నల్లబెల్లి
ఇరవై ఏళ్ల నుంచి దేశీ రకం మిర్చి పంట సాగు చేస్తున్న. ఈ ఏడాది నాలుగెకరాల్లో పెట్టిన. పూత సమయంలో తామర పురుగు ఆశించింది. చాలా రోజులు దాంతో పోరాడిన. పెట్టుబడి గతంలకంటే డబులైంది. రూ.3 లక్షలకుపైన పెట్టిన. కాత సమయంలో వర్షం పడింది. నా అదృష్టం. దేవుడు కరుణించిండు. వడగండ్లు పడలేదు. కొంతమేర పంట దెబ్బతిన్నది. అప్పటికే తామర పురుగు నష్టం కలిగించడం వల్ల దిగుబడి బాగా తగ్గింది. గతంలో ఒక ఎకరంలో 16 నుంచి 19 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఈ సారి 6 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది. ఇప్పటి వరకు నాలుగెకరాల్లోని పంట నుంచి ఒకసారి 3, మరోసారి 10, సోమవారం 14 క్వింటాళ్లు అమ్మిన. ఇంకో 3 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చు. మొత్తం కలిపితే 30 క్వింటాళ్లకు చేరుతుంది. 10 క్వింటాళ్లు అమ్మిన రోజు ధర రూ.42 వేలు లభించింది. సోమవారం దేశంలోనే రికార్డ్ స్థాయి ధర రూ.55,551 నాకు రావడం చాలా ఆనందంగా ఉంది.