దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా సాగింది. కూలినాలి చేసుకొని బతికే పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీపై వాహనాలు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మంగళవారం హనుమకొండలోని గిరిజన భవన్లో రూ.3.82కోట్ల విలువజేసే 42యూనిట్లను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అందజేశారు. ఇందులో కమలాపూర్లో 35మందికి, పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గురు, వర్ధన్నపేటలో నలుగురికి వారు కోరుకున్న వాహనాలు అందించగా, వాటిని అందుకొని లబ్ధిదారులు మురిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ జీవితాల్లో కొత్త వెలుగునింపారంటూ హర్షం వ్యక్తంచేశారు.
హనుమకొండ, ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని దళితబంధు లబ్ధిదారులకు సుమారు రూ.3.82 కోట్ల యూనిట్లు పంపిణీ చేశారు. హనుమకొండ గిరిజన సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన ఈ పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులు కుటుంబంతో కలిసి తరలివచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని 35మంది లబ్ధిదారులకు రూ. 3,18,11,828లతో 27యూనిట్లు అందించారు. అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ముగ్గు రు లబ్ధిదారులకు 26,68,000 విలువ చేసే మూడు యూనిట్లు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో నలుగురు లబ్ధిదారులకు 38,82,000 విలువ చేసే నాలుగు యూనిట్లు అందజేయగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి తమ జీవితాల్లో వెలుగులు నింపారంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇందులో మూడు చక్రాల ప్యాసింజర్ వా హనాలు, నాలుగు చక్రాల వాహనాలు, డీసీఎంలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, రోటవేటర్లు, మేజ్ షెల్లర్లు, ట్రాన్స్ప్లాంటర్లు, బొలెరో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ట్ వాహనాలు, టాటా మాజిక్ వాహనాలు ఉన్నాయి. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, డీసీపీ అశోక్బాబు, ఆర్డీవో వాసుచంద్ర, ఏసీపీ జితేందర్రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, తహసీల్ద్దార్ జి.రాజ్కుమార్, వివిధ దళిత సంఘాల నాయకులు ఎర్రగట్టు స్వామి, పరంజ్యోతి, పుట్ట రవి, పసునూరి మనోహర్, మిద్దెపాక ఎల్లయ్య, సుంచు రాజేందర్, నరేశ్, మంద రాజు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ధైర్యం ఇచ్చిండు..
మాది పేద కుటుంబం. దళితబంధు కింద మమ్ముల ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకంతోటి వచ్చిన డబ్బులతో నాటువేసే మిషన్ తీసుకున్నం. ఇప్పుడు మాకు ఆదాయం పెరుగుతుంది. కేసీఆర్ అమలుచేస్తున్న దళి తబంధు పథకం ద్వారా కొనుక్కొన్న మిషన్తో మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మా కుటుంబానికి వెలుగును ఇచ్చిన దేవుడు కేసీఆర్. దళిత కుటుంబాలను అన్నితీర్ల ఆదుకొని ఆసరా అవుతున్న టీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటం.
– గాజుల రమేశ్, గూడూరు, కమలాపూర్
ఆటో ట్రాలీ కొనుక్కున్నం..
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. కూలినాలి చేసుకొనే బతికే మాకు దళితబంధు పథకం కొండంత భరోసానిచ్చింది. ఈ పథకం కింద మమ్మల్ని ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులతో ఆటో ట్రాలీ కొనుక్కున్నం. మేము చేసుకొనే పనికి అదనంగా మరికొంత డబ్బులు వస్తయ్. ఆర్థికంగా బలపడేందుకు సీఎం కేసీఆర్ ఎంతో సాయం చేశారు. మా కుటుంబాలను ఇంకా మంచిగా సాదుకొనే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ సారును మరచిపోము.
– పాతం ఎల్లమ్మ, కానిపర్తి, కమాలాపూర్