నయీంనగర్, ఏప్రిల్ 5 : నిట్ వరంగల్ స్ప్రింగ్ స్ప్రీ (వసంతోత్సవం)-2022కి ముస్తాబవుతున్నది. ‘సృష్టి’ ఇతివృత్తంతో ఈ నెల 7,8,9,10 తేదీల్లో వేడుకలు జరిపేందుకు ‘స్టూడెంట్స్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద సాంస్కృతిక మహోత్సవానికి సంబంధించి ఇటీవలే పోస్టర్ను నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, రిజిస్ట్రార్ గోవర్ధన్రావు ఆవిష్కరించారు. 2019లో చివరిసారిగా నిర్వహించినా, కొవిడ్ కారణంగా రెండేళ్లు ఏర్పాటు చేయలేదు. ‘ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచే ప్రారంభించాలి’ అన్న స్లోగన్తో సృష్టి (పునర్జన్మ) అనే థీమ్కు రూపకల్పన చేశారు.
స్ప్రింగ్ స్ప్రీ నేపథ్యం..
అప్పటి ఆర్ఈసీ (ప్రస్తుత నిట్) ప్రిన్సిపాల్ కే కోటేశ్వర్రావు 1978లో తొలిసారిగా స్ప్రింగ్ స్ప్రీకి అంకురార్పణ చేశారు. రెండేళ్లకోసారి ఈ వసంతోత్సవాన్ని నిర్వహిస్తూ వచ్చా రు. విశేష స్పందన రావడంతో విద్యార్థుల కోరిక మేరకు యేటా నిర్వహిస్తున్నారు. వేడుకలకు దేశంలో ప్రసిద్ధిగాంచిన ఇంజినీరింగ్ కళాశాలలు, ఐఐటీల నుంచి రెండు వేల మందికిపైగా విద్యార్థులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే సుమారు 50 రకాల ఈవెంట్లలో పాల్గొననున్నారు. విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం నిట్లో వసతి కల్పిస్తున్నారు.
స్టూడెంట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో..
స్ప్రింగ్ స్ప్రీ కోసం నిట్ ‘స్టూడెంట్స్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కో ఆర్డినేటర్లుగా ముగ్గురిని ఎంపిక చేశారు. వీరిలో సివిల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థిని పూజిత, ఎలక్ట్రికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఆదినారాయణ, సివిల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి సాయిరోహిత్ ఉన్నారు. ఒక్కో కో ఆర్డినేటర్ కింద నాలుగు బృందాలు పనిచేస్తాయి. బృందంలో ఐదుగురు చొప్పున సభ్యులుంటారు. మొత్తంగా ఒక్కో కో ఆర్డినేటర్ కింద 20 మంది సభ్యులు పనిచేస్తారు. అలా ముగ్గురి ఆధ్వర్యంలో 60 మంది వేడుకల నిర్వహణ బాధ్యతలు చూస్తారు. మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సబ్ కోర్గా నియమిస్తారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు వర్క్ ఫోర్స్ వలంటీర్లుగా వ్యవహరిస్తారు. స్టూడెంట్స్ కౌన్సిల్ బాధ్యతలు నిర్వర్తించే విద్యార్థులు కళాశాలను మానిటరింగ్ చేస్తారు. వీరందరినీ కౌన్సిల్ సెక్రటరీ ప్రశాంత్ రాచమల్ల సమన్వయం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్లలో పాల్గొనే వారు, వీక్షించేవారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరికి మూడు రోజులపాటు భోజనం, వసతి కల్పిస్తారు. వివరాలకు www.springspree22.inలో సంప్రదించాలి.
ఇదీ షెడ్యూల్..
7న : సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, రిజిస్ట్రార్ గోవర్ధన్రావు, డీన్ రవికుమార్ పులి, స్ప్రింగ్ స్ప్రీ ఫ్యాకల్టీ అడ్వైజర్ ఏ వేణువినోద్ హాజరవుతారు.
8న : ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈవెంట్లు ఉంటాయి. రాత్రి 8 గంటల నంచి రామ్మిరియాల (డీజే టిల్లు సినిమా గాయకుడు), బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీరామచంద్ర ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
9న : ఉదయం 8 గంటల నుంచి యథావిధిగా ఈవెంట్లు ప్రారంభమవుతాయి. సాయంత్రం గోవాకు చెందిన అండర్ గ్రౌండ్ అథారిటీ బ్యాండ్, సన్ బార్ డీజే ఆస్ట్రిక్ బృందాలు ప్రదర్శన ఇస్తాయి.
10న : ముగింపు వేడుకలు ఉంటాయి. రెండు రోజుల ఈవెంట్లలో పాల్గొని ప్రతిభ చూపినవారికి బహుమతుల ప్రదానం ఉంటుంది. రాత్రి 8గంటల నుంచి నిట్ విద్యార్థుల ఫ్యాషన్ షో ఉంటుంది. 9 నుంచి 11 గంటల వరకు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు దర్శన్రావల్ పాటలతో సందడి చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తిచేశాం
నిట్లో వసంతోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంస్కృతికోత్సవానికి దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి రెండు వేలమందికిపైగా విద్యార్థులు, సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ వెంట్లలో పాల్గొనే వారికి భోజనం, వసతి కల్పిస్తాం.
-గోవర్ధన్రావు, నిట్ రిజిస్ట్రార్
విద్యార్థుల ఆధ్వర్యంలోనే..
స్ప్రింగ్ స్ప్రీ నిర్వహణ బాధ్యతలను విద్యార్థులే చూస్తున్నారు. సమయం తక్కువ ఉన్నందున రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రెండేళ్ల పాటు నిర్వహణ లేకపోవడంతో సీనియర్ విద్యార్థులే ముందుండి నడిపిస్తున్నారు. జూనియర్లకు అనుభవం లేకున్నా చురుగ్గా ఏర్పాట్లలో నిమగ్నవుతున్నారు.
-డీన్ రవికుమార్ పులి
రెండేళ్ల తర్వాత..
కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత నిట్లో వసంతోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. సృష్టి అనే ఇత్తి వృత్తంతో ఈసారి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే వేడుకలోల రెండు వేల మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొంటారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారు.
-ఏ వేణువినోద్, స్ప్రింగ్ స్ప్రీ ఫ్యాకల్టీ అడ్వైజర్