జనగామ, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధిలో అట్టడుగున ఉన్న దళితులను ఆదుకునేందుకు మహా సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిధిగృహం వద్ద జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన బాబూ జగ్జీవన్రామ్ 115వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, డీసీపీ సీతారామ్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ మహనీయులు బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించి వక్రభాష్యం చెప్పాయని, రాజ్యాంగం అంటే కేసీఆర్కు ఎంతో గౌరవమని ఆయన తెలిపారు. బాబూ జగ్జీవన్రామ్ అత్యంత వెనుకబడిన సామాజికవర్గం నుంచి వచ్చారని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సేవలందించారని ఎర్రబెల్లి కొనియాడారు. దళితులను అభివృద్ధి చేసేందుకు తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన దళితబంధు పథకం అక్కడ వందశాతం పూర్తయిందన్నారు.
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందుతుందని ఎర్రబెల్లి వివరించారు. ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారని ఎర్రబెల్లి తెలిపారు. వైన్షాపులు, మెడికల్ షాపులు, ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు, రైస్ మిల్లుల ఏర్పాటులో దళితులకు రిజర్వేషన్ వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున సాయం అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.1.70 లక్షల కోట్లు కేటాయింపునకు సీఎం సిద్ధంగా ఉన్నారని ఎర్రబెల్లి చెప్పారు. దళితబంధు పర్యవేక్షణకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిని నియమించారని, మూడేళ్లలో దళితులందరికీ లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి జీ గట్టుమల్లు తదితరులు పాల్గొన్నారు.