వరంగల్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : ధాన్యం ఉద్యమం ఉధృతమైంది. యాసంగి వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్తో టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. సోమవారం పార్టీ శ్రేణులు చేపట్టిన దీక్షలు, నిరసనలు, రాస్తారోకోలకు ప్రజలు, రైతులు కలిసివచ్చి కదంతొక్కారు. ఆరు జిల్లాల్లోని అన్ని మండలకేంద్రాల్లో తలపెట్టిన నిరసనల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
రాయపర్తి, కొడకండ్ల , దేవరుప్పుల, తొర్రూరు, పెద్దవంగర మండలకేంద్రాల్లో నిరసన దీక్షలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. గణపురం, రేగొండ, శాయంపేటలో ఎమ్మెల్యే గండ్ర, నడికూడ, పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ధర్మసాగర్, వేలేరు, చిల్పూర్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జనగామ, బచ్చన్నపేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య, జఫర్గఢ్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, మడికొండ, పాలకుర్తిలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మహబూబాబాద్, కేసముద్రం, గూడూరులో ఎమ్మెల్యే శంకర్నాయక్, కురవి, మరిపెడలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు.
ములుగులో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఏటూరునాగారంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట, ఖానాపురంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్ పోచమ్మమైదాన్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని కేంద్రం తీరును ఎండగట్టారు. వడ్లను కొనుగోలు చేయాల్సిందేనని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలకు మనుగడ ఉండదంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. యాసంగిలో కోతలకు వస్తున్న వరి పంట మొత్తాన్ని కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. ఊరూరా జరిగిన ఈ నిరసన దీక్షల్లో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కార్యక్రమం విజయవంతమైంది.