పోచమ్మమైదాన్(కాశీబుగ్గ), డిసెంబర్ 21: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం దత్తత గ్రామాల్లో ఆయిల్పామ్ పంటల దిగుబడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్పామ్ సాగు చేయనున్న రైతుల క్షేత్రాలను జాతీయ ఆయిల్ పరిశోధన సంస్థ (ఐఐవోపీఆర్) అధిపతి డాక్టర్ ఎంవీ ప్రసాద్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం బలరాం, అధ్యాపకులు, ఉద్యాన అధికారులు శ్రీనివాసరావు, తిరుపతి సందర్శించి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించారు.
ముఖ్యంగా నల్లరేగడి నేలను ఆయిల్పామ్ పంట సాగుకు వినియోగించాలంటే మరింత చదును చేసుకోవాలన్నారు. కేవలం నీరు నిలబడని నేలను మాత్రమే పంట సాగుకు ఎంపిక చేసుకోవాలని సూచించారు. నెలలోని ఒండ్రు శాతాన్ని తగ్గించుకునేందుకు మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. ఎర్రమట్టి, పశువుల పెంటతో కలిపి మొక్కలను నాటుకోవాలని వివరించారు. దీంతో నల్లరేగడి ఆయిల్పామ్కు అనుకులంగా మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ హేమశరత్చంద్ర, డాక్టర్ జే కమలాకర్, డాక్టర్ ఎం హారిక, డాక్టర్ రాజు, రైతులు పాల్గొన్నారు.