ఖిలావరంగల్, డిసెంబర్ 17: ఇటు ఊర కుక్కలు.. అటు కోతుల సంచారంతో నగర జనం బెంబేలెత్తుతున్నది. ఎటు వెళ్లి రావాలన్నా ఆచితూచి ముందుకు అడుగేయాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దు పొడిచింది మొదలు.. రాత్రయ్యే వరకూ ఊర కుక్కలు, కోతులు కాలనీల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లల్లో మూకుమ్మడి దాడులు చేస్తూ వస్తువులు, ఆహార పదార్థాలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రధానంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కోతుల బారిన పడకుండా జాగ్రత్త పడాల్సి వస్తున్నది. ఒక్కోసారి కోతులు పిల్లలపై దాడులు చేసి బ్యాగ్లు, టిఫిన్ బాక్స్లను లాక్కెళ్తున్నాయి. ఇదిలా ఉంటే రైల్వేగేటు ప్రాంతంలోని శివనగర్, పుప్పాలగుట్ట, పెరుకవాడలో కోతులు స్వైరవిహారం చేస్తుంటే.. మరోవైపు కుక్కలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కుక్కలు, కోతుల దాడుల్లో గాయాలపాలైన వారు ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల కుక్కులను పట్టిన సిబ్బంది వాటిని ప్రధాన రహదారులపై వదలడంతో అవి కార్లు, బైక్ల వెంట పరుగులు పెడుతూ వాహనదారులను భయభ్రంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వందల సంఖ్యలో కోతులు ఉంటే బోన్లు ఏర్పాటు చేసి అధికారులు కేవలం పదుల సంఖ్యలోనే పట్టుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతులు, కుక్కల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కార్పొరేషన్ అధికారులను కోరుతున్నారు.
కోతులతో భయం.. భయం..
కరీమాబాద్: కోతులతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని రంగశాయిపేట, శంభునిపేట, ఉర్సు, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్తోట, ఏకశిలానగర్లో కోతుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక ఘటనను మరువకముందే మరో ఘటన జరుగుతున్నది. చిన్నాపెద్ద తేడా లేకుండా కోతుల దాడిలో గాయాలపాలవుతున్నారు. ఇటీవల కరీమాబాద్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఓ మహిళను కరిచి గాయపరిచింది. మరుసటి రోజు కరీమాబాద్లోని ఓ పాఠశాల ఆవరణలో చిన్నారిని కరిచి గాయపరిచింది. రెండు రోజుల అనంతరం రంగశాయిపేటలో కోతులను చూసి ఓ వ్యక్తి భయంతో గోడ పైనుంచి దూకగా కాళ్లు విరిగాయి. ఇలా రోజూ ఏదో ఒకచోట కోతుల వల్ల ప్రజలు గాయాలపాలవుతూనే ఉన్నారు. అధికారులు చర్యలు చేపట్టి కోతుల తరలింపును ముమ్మరం చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.