వరంగల్, (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దేశ ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బుధవారం ప్రారంభించనున్నందున పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సంబురాలు జరుపుకునేందుకు శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు మంగళవారం హస్తినాకు బయల్దేరారు. రాత్రి వరకు పలువురు ఢిల్లీ చేరుకున్నారు. జాతీయ పార్టీగా అవతరించడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్పునకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 8న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈనెల 9న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ చేశారు.
అనంతరం ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఢిల్లీలోని సర్దార్ పటేల్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ ఆదివారం ప్రముఖ వాస్తుశిల్పి సుద్దాల సుధాకర్తేజతో కలిసి ఏర్పాట్లు చేశారు. వాస్తుకు అనుగుణంగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రారంభానికి సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మంగళవారం పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం 12.37గంటలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
మంగళవారం అక్కడే రాజశ్యామల యాగం చేపట్టారు. బుధవారం చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి జరగనున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చట్టసభల ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీలు, జిల్లా పరిషత్ల చైర్మన్లు, నగర పాలక సంస్థల మేయర్లు, పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు పాల్గొననున్నారు. జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీకి బయల్దేరారు. వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్తోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం మధ్యాహ్నం జిల్లాలో సంబురాలు జరిపేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.