వర్ధన్నపేట, డిసెంబర్ 10: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హెచ్చరించారు. పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని వరంగల్-ఖమ్మం జాతీయ ప్రధాన రహదారిలో ఉన్న బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రధానంగా వర్షకాలంలో బస్టాండ్ ఆవరణలో నీరు చేరి చిత్తడిగా మారుతున్నందున నీటి మళ్లింపు చర్యలు చేపట్టామన్నారు. అలాగే, డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. దీనికితోడు వర్ధన్నపేట బస్టాండ్ లోతట్టు ప్రాంతంలో ఉండడంతో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు.
ఇందుకోసం త్వరలోనే బస్టాండ్ ఆవరణను ఆధునీకరించడంతోపాటు చుట్టూ సీసీ లైనింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అరూరి హామీ ఇచ్చారు. అలాగే, ప్రయాణికులు వేచి ఉన్న సమయంలో వారికి తాగునీరు, రాత్రి సమయంలో కూడా మెరుగైన వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని విషయాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. బస్టాండ్లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయించేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరింరారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో అరూరి మాట్లాడారు. బస్టాండ్ ఆవరణలో చేపట్టాల్సిన పనులతోపాటు వారి గ్రామాలకు సంబంధించిన వివరాలు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆప్యాయంగా పలుకరించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక నాయకులు, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.