మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 10: అనేక పథకాలు అమలు చేస్తూ అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటూ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అయ్యారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇచ్చేందుకే గ్రామగ్రామాన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకంలో మోసం చేయకుండా కొనాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్కు మనందరం అండగా నిలవాలన్నారు. అనంతరం మండలంలోని జమాండ్లపల్లి గ్రా మంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ గౌడ కులస్తులతో కలిసి ఈత, గిరక తాళ్ల మొక్కలు నాటారు. గత పాలకులు పేదల గురించి పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమ కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, నాయిని రంజిత్, సుధగాని మురళి, వార్డ్ కౌన్సిలర్లు ఇందిరా, నర్సయ్య, గోవర్ధన్, సురేశ్, నాయకులు పాల్గొన్నారు.